లాక్ డౌన్ పొడిగించిన వేళ.. దేశంలో మూడు జోన్ల ‘ఎంపిక’

| Edited By: Pardhasaradhi Peri

Apr 12, 2020 | 4:25 PM

దేశంలో కరోనా వ్యాప్తి నివారణకు లాక్ డౌన్ ని ప్రభుత్వం మరో రెండు వారాలు పొడిగించిన వేళ.. ప్రజలకు కాస్త వెసులుబాటు కల్పించేందుకు సర్కార్ ఓ 'కలర్ కోడ్' ని రూపొందించింది.

లాక్ డౌన్ పొడిగించిన వేళ.. దేశంలో మూడు జోన్ల ఎంపిక
Follow us on

దేశంలో కరోనా వ్యాప్తి నివారణకు లాక్ డౌన్ ని ప్రభుత్వం మరో రెండు వారాలు పొడిగించిన వేళ.. ప్రజలకు కాస్త వెసులుబాటు కల్పించేందుకు సర్కార్ ఓ ‘కలర్ కోడ్’ ని రూపొందించింది. భారత మ్యాప్ లో ఈ కలర్ జోన్లను పొందుపరచనున్నారు. రెడ్, ఆరెంజ్, గ్రీన్.. ఈ మూడు రంగులను విభజించడం వల్ల ప్రజల రాకపోకలకు అవరోధం ఉండదని, ఎకానమీని కొంతవరకైనా పునరుధ్దరించవచ్చునని భావిస్తున్నారు.  కరోనా మహమ్మారి లేని కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనలను సడలించే అవకాశాలు ఉన్నాయని మోదీ.. ముఖ్యమంత్రులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో సూచన ప్రాయంగా చెప్పారు. ఈ మూడు రంగుల జోన్ల మర్మమేమిటంటే.. గ్రీన్ జోన్ పరిధి కిందకు వచ్ఛే ప్రాంతాలంటే అసలు కరోనా ఛాయలు లేని జిల్లాలని తెలుస్తోంది. దేశంలో 400 జిల్లాల్లో ఈ కేసులు లేవని ప్రభుత్వం భావిస్తోంది. ఆరెంజ్ జోన్ ఏరియాలంటే.. 15 కు మించి కరోనా కేసులు గానీ, అలాగే హెచ్చు పాజిటివ్ కేసులు గానీ నమోదు కాని ప్రాంతాలని అర్థం.. ఈ విధమైన జిల్లాల్లో పరిమితంగా పబ్లిక్ ట్రాన్స్ పోర్టును అనుమతించడం, వ్యవసాయోత్పత్తులకు అనువుగా హార్వెస్టింగ్ కి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుందని తెలుస్తోంది. 15 కరోనా కేసులకు మించిన జిల్లాలను రెడ్ జోన్ కిందకు చేర్చారు. ఎకానమీని పునరుధ్ధరించే యత్నంలో భాగంగా మోడీ నిన్న’జాన్ హై జహాన్ హై’ (లైఫ్ ఉంటే ప్రపంచం ఉంటుంది) అని, అదే సమయంలో జాన్ భీ జహాన్ భీ (లైఫ్ ప్లస్ ప్రపంచం) అని కూడా వ్యాఖ్యానించిన విషయం గమనార్హం. అంటే ఆర్ధిక వ్యవస్థకు, ప్రజల జీవనాలకు లింక్ ఉంటుందని అంటున్నారు.

లాక్ డౌన్ కారణంగా ఇండియా వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో 1.5 నుంచి 2.8శాతం ఆర్ధిక వృద్దిని మాత్రమే సాధిస్తుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. కాగా-ఫుడ్ ప్రాసెసింగ్, ఏవియేషన్, ఫార్మాస్యుటికల్స్, ఇండస్ట్రీస్, నిర్మాణ రంగం తదితర రంగాలకు సంబంధించి కొన్ని సడలింపులను కల్పించాలని హోమ్ శాఖ భావిస్తోంది.