ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కి మళ్ళీ రెండో సారి కరోనావైరస్ టెస్ట్ నిర్వహించారు. నిన్న చేసిన టెస్ట్ లో ఆయనకు నెగటివ్ అని రిపోర్టు వఛ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా ఆయన తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నారని, ఆక్సిజన్ ఇస్తున్నామని ఆయన చికిత్స పొందుతున్న రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నాయి. ఆయన పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు డాక్టర్లు తెలిపారు. జ్వరం, శ్వాస సంబంధమైన రుగ్మతలతో సత్యేంద్ర జైన్ ఈ నెల 15 న ఆసుపత్రిలో చేరారు. ఆయన త్వరగా కోలుకోవాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఇప్పటికే ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. హోం మంత్రి అమిత్ షా ఇటీవల ముఖ్యమంత్రితోను, ఆ తరువాత నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో.. ఢిల్లీలో ప్రతి వారికీ కరోనా టెస్టులు నిర్వహిస్తామని ప్రకటించారు. కరోనాపై పోరులో మనదే విజయం కావాలన్నారు.