సంక్షోభంలో ఆటో మొబైల్ రంగం.. అమ్మకాలు డీలా.. ఉద్యోగుల ఉద్వాసన

| Edited By:

Sep 09, 2019 | 4:52 PM

భారతీయ ఆటోమోబైల్ ఉత్పత్తుల అసోసియేషన్ గణాంకాలు ప్రస్తుతం నివ్వెరపరుస్తున్నాయి. ఈ నివేదిక ప్రకారం గత నెలలో ప్యాసింజర్ వాహనాలు, ఇతర వాహనాల అమ్మకాలు విపరీతంగా పడిపోయినట్టు తేలింది. గత పదినెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా.. ఆగస్టు నెలలో మాత్రం అమ్మకాలు మరింత క్షీణించాయని సియామ్ వెల్లడించింది. వరసబెట్టి పది నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతూ దేశీయ ఆటో పరిశ్రమ కుదేలవడం ఆలోచింపజేసే అంశంగా తెలుస్తోంది. 1997 98 నుంచి డేటాను అమ్మకాలు, కొనుగోలు రికార్డు చేయడం ప్రారంభించిన […]

సంక్షోభంలో ఆటో మొబైల్ రంగం.. అమ్మకాలు డీలా..  ఉద్యోగుల ఉద్వాసన
Follow us on

భారతీయ ఆటోమోబైల్ ఉత్పత్తుల అసోసియేషన్ గణాంకాలు ప్రస్తుతం నివ్వెరపరుస్తున్నాయి. ఈ నివేదిక ప్రకారం గత నెలలో ప్యాసింజర్ వాహనాలు, ఇతర వాహనాల అమ్మకాలు విపరీతంగా పడిపోయినట్టు తేలింది. గత పదినెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా.. ఆగస్టు నెలలో మాత్రం అమ్మకాలు మరింత క్షీణించాయని సియామ్ వెల్లడించింది. వరసబెట్టి పది నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతూ దేశీయ ఆటో పరిశ్రమ కుదేలవడం ఆలోచింపజేసే అంశంగా తెలుస్తోంది.

1997 98 నుంచి డేటాను అమ్మకాలు, కొనుగోలు రికార్డు చేయడం ప్రారంభించిన నాటినుంచి ఇప్పటికి ఇదే అతిపెద్ద క్షీణతగా నివేదిక వెల్లడించింది. అమ్మకాలు ఊహించని విధంగా తగ్గడంతో ఆయా ఆటోమొబైల్ సంస్ధలు తమ కంపెనీల్లో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులు 15వేల మందిని తొలగించాయి. దీంతో వీరంతా రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే మూడు నెలల కాలంలో దాదాపు 300 డీలర్ ఫిప్‌లు మూతపడ్డాయి. తమ వద్ద పని చేస్తున్న దాదాపు 2.8 లక్షలమందిని దేశవ్యాప్తంగా ఉన్న డీలర్లు తొలగించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో 10 లక్షల మంది తమ ఉద్యోగాలు పోగుట్టుకోవడం ఖాయమనే ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.

దేశంలో ప్రస్తుతం ఆటోమొబైల్ రంగం భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది.దీంతో దేశీయంగా కార్లను తయారీ చేస్తున్న అతిపెద్ద సంస్ధ మారుతీ సుజుకీ గత వారంలో హర్యానాలోని గురుగ్రామ్, మనేసర్ ప్రాంతాల్లో ఉన్న తమ ప్లాంట్లలో ఉత్పత్తిని అమాంతం నిలిపివేసింది. మారుతీ బాటలో హెవీ వెహికల్స్ తయారీ సంస్ధ అశోక్ లేలాండ్స్ కూడా తమ ఉద్యోగులకు 16 రోజుల పాటు పనిదినాలను రద్దు చేసినట్టు ప్రకటించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే లక్షలాది మంది తమ ఉద్యోగాలు కోల్పోవలసి వస్తుందని, ఆటోమొబైల్ తయారీ సంస్ధలు భయాందోళన వ్యక్తం చేస్తున్నాయి. అందువల్ల ఎలాగైనా సమస్య నుంచీ గట్టెక్కాలని ఆలోచనతో ఈ కంపనీకి చెందిన ఐదు ప్లాంట్లలో… నాన్ వర్కింగ్ డేస్ ప్రవేశపెట్టింది. ఈ నెలలోనే ఈ నిర్ణయం అమల్లోకి తెచ్చింది. ఇందుకు సంబంధించి ఓ ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం… ఎన్నోర్ ప్లాంట్‌లో ఈ నెలలో 16 నాన్ వర్కింగ్ డేస్ ప్రకటించింది. అలాగే అళ్వార్, భండారా ప్లాంట్లలో 10 రోజులు, పంత్‌నగర్ ప్లాంట్‌లో ఏకంగా 18 రోజులు,హోసూర్ 1, 2 ప్లాంట్లు,సీపీపీఎస్ లో ఐదు రోజులు, నాన్ వర్కింగ్ డేస్ ప్రకటించింది.

ప్రయాణీకులను చేర్చే ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు ఈ ఏడాది 31.57 శాతం పడిపోయి గత నెలలొ 196,524 యూనిట్లకు తగ్గిపోయాయి. ప్రస్తుతం ఈ ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 41.09 శాతం తగ్గి 115,957 యూనిట్లకు చేరుకున్నాయి. వీటిలో ముఖ్యంగా బస్సులు, ట్రక్కుల అమ్మకాలు 39 శాతం పడిపోగా, టూ వీలర్ అమ్మకాలు 22 శాతం పడిపోయి 1.5 మిలియన్ యూనిట్లకు చేరాయి. ఇదిలా ఉంటే ఈ ఉత్పత్తుల ఎగుమతులు మాత్రం 14. 73 శాతం పెరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

భారతీయ ఆటో మొబైల్ రంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణమే విధానపరమైన నిర్ణయాలను తీసుకోవా భారత ఆటోమొబైల్‌ తయారీదారుల సంఘం (సియామ్‌) డిమాండ్ చేస్తోంది. ఈ రంగానికి సంబంధించి వస్తు, సేవల పన్ను తగ్గింపు, స్క్రాపేజ్‌ పాలసీ వంటి నిర్ణయాలను వెంటనే తీసుకుని ఈ పరిశ్రమకు పూర్వవైభవాన్ని తీసుకురావాలని సియామ్ కోరుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 28 శాతం ఉన్న జీఎస్‌టీ రేటును 18 శాతానికి తగ్గించాలని సియామ్ గతంలో కోరగా.. దీనికి సంబంధించి ప్రభుత్వం తుది నిర్ణయాన్నిఇంకా ప్రకటించలేదు. జీఎస్టీ రేటు తగ్గితే వాహన ధరలు భారీగా తగ్గి డిమాండ్‌ మళ్లీ పెరిగేందుకు అవకాశం ఉందని సియామ్ భావిస్తోంది.