భారత్ను కరోనా వెంటాడుతోంది. దేశంలో రోజురోజుకూ విస్తరిస్తున్న వైరస్ ప్రమాదఘంటికలు మోగిస్తోంది. ఇప్పటికే దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 17వేలు దాటింది. ఇక మరణాల సంఖ్య 500లకు చేరింది. వైరస్ విజృంభిస్తున్న తరుణంలో బీమా నియంత్రణ మండలి ఐఆర్డీఏఐ కీలక నిర్ణయం తీసుకున్నది. క్యాష్లెస్ ట్రీట్మెంట్, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ వంటి వాటికి సంబంధించిన రిక్వెస్ట్లను 2 గంటల్లోనే సెటిల్ చేయాలని ఐఆర్డీఐఏ ఇన్సూరెన్స్ సంస్థలను ఆదేశించింది. కరోనా వైరస్కు సంబంధించి పాలసీదారులు ఏమైనా క్లెయిమ్ ఫైల్ చేస్తే.. ఇప్పుడు అది వేగంగా సెటిల్ కానున్నాయి.
కరోనావైరస్ ప్రతికూల పరిస్థితుల కారణంగా హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్పై 2 గంటల్లోనే నిర్ణయం తీసుకోవాలని ఐఆర్డీఏఐ తెలిపింది. సరైన సమయంలో క్లెయింలు కాకపోవడంతో ఆస్పత్రుల దగ్గర రోగులు పడిగాపులు పడాల్సి వస్తున్న తరుణంలో ఐఆర్డీఏఐ తాజా నోటిఫికేషన్ను జారీచేసింది. నగదు రహిత ఆరోగ్య సేవలు పొందుతున్నవారు ముందుగానే ఆసుపత్రికి తెలియచేయాలని, వారు అడిగిన బిల్లు, తదితరాలను బీమా సంస్థలకు అందచేయాలని సూచించింది. ఆ తర్వాత డిశ్చార్జ్ అయిన రెండు గంటల్లో నెట్వర్క్ ప్రొవైడర్కు అన్ని రకాల పత్రాలను అందచేయాలని పేర్కొంది.
ఇక,.. హెల్త్, మోటార్ ఇన్సూరెన్స్ పాలసీల రెన్యూవల్ తేదీలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మార్చి 25 నుంచి మే 3 మధ్యలో రెన్యూవల్ డేట్ కలిగిన పాలసీలకు మే 15 వరకు గడువునిచ్చింది. అంటే హెల్త్, మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలు కలిగిన వారు మే 15లోపు పాలసీలను రెన్యూవల్ చేసుకోవచ్చు. కేంద్ర తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో హెల్త్ ఇన్సూరెన్స్, మోటార్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు కూడా ప్రయోజనం కలుగనుందని విశ్లేషకులు చెబుతున్నారు.