పసిడి ప్రియులకు భారీ షాక్ తగిలింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. మెళ్లిగా పెరుగుతూ.. ఏకంగా రూ.42వేల మార్క్ను అందుకుంది. ఇలానే కొనసాగితే.. త్వరలోనే రూ.50వేలు అందుకునేలా ఉంది. దేశ రాజధానిలో బుధవారం రూ. 462 పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 42,339కు చేరింది. అటు వెండి కూడా.. బంగారానికి పొటీగా పెరుగుతోంది. ఒక్కరోజే రూ.1,047 పెరిగి కేజీ వెండి ధర రూ. 48,652 పలికింది.
కాగా.. కరోనా ఎఫెక్ట్తో మార్చి త్రైమాసికంలో ఆదాయ అంచనాలను అందుకోకపోవచ్చని ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ వెల్లడించింది. దీని ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్రంగా చూపిస్తోంది. ఈ క్రమంలో బంగారంలో పెట్టుబడులు పెట్టడమే మంచిదని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. దీంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు మళ్లీ ఒక్కసారిగా పెరిగాయి. ఇదిలా ఉంటే.. దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ కావడం కూడా బంగారం ధరలు పెరగడానికి మరో రీజన్ అని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.