లీడర్లపై నమోదయ్యే కేసులపై ఇక సత్వర విచారణ!

|

Sep 16, 2020 | 12:44 PM

ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల సత్వర విచారణకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ప్రతినిధులపై నమోదయ్యే కేసులను వేగంగా విచారించేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ ట్రయల్స్‌కు కేంద్రం సానుకూలంగా ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా...

లీడర్లపై నమోదయ్యే కేసులపై ఇక సత్వర విచారణ!
Follow us on

ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల సత్వర విచారణకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ప్రతినిధులపై నమోదయ్యే కేసులను వేగంగా విచారించేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ ట్రయల్స్‌కు కేంద్రం సానుకూలంగా ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బుధవారం సుప్రీంకోర్టు ధర్మాసనానికి నివేదించారు. ఈ రకమైన కేసుల సత్వర విచారణ కోసం కాలవ్యవధిని నిర్ణయించవచ్చని, ఈ విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం తీసుకునే ఏ నిర్ణయానికైనా కేంద్రం సానుకూలంగా ఉందని తుషార్ మెహతా అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు.

ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను ఏడాదిలోగా విచారణ పూర్తి చేయాలని 2015లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఐదేళ్ల తర్వాత అంటే 2020 నాటికి కూడా అమలు కాకపోవడంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఈ విచారణలో భాగంగా అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా సెప్టెంబర్ తొలివారంలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధులపై నమోదయ్యే నేరారోపణ కేసులపై ఫాస్ట్ ట్రాక్ ట్రయల్‌కు సుముఖత వ్యక్తం చేసింది.

ఈ తరహా కేసుల విచారణకు సుప్రీంకోర్టు కాలవ్యవధిని నిర్దేశించవచ్చని కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అత్యున్నత న్యాయస్థానానికి నివేదించారు. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై దాఖలయ్యే కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం అయ్యింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు త్వరలోనే కీలక తీర్పు వెలువరించే అవకాశాలున్నాయి.