ఏపీలో ఉద్యోగ సంఘాలు మరోసారి ఆందోళనలకు సిద్దమయ్యాయి. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. కార్యాచరణ ప్రకటించారు ఉగ్యోగ సంఘాల నేతలు. దాంతో.. ఉద్యోగ సంఘాలను ఏపీ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. 13 ఉద్యోగ సంఘాలతో కేబినెట్ సబ్కమిటీ భేటీ అయింది. ఉద్యోగుల సమస్యలపై చర్చిస్తారు కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు. గతంలో ఇచ్చిన హామీలు అమలు కాకపోవటం, ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండడంతో.. బకాయిల చెల్లింపు, మధ్యంతర భృతిపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
ఇక.. ఎన్నికల సమయంలో ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు ఒత్తిడి పెంచుతూ మరోసారి ఆందోళనకు సిద్ధమయ్యాయి. ఈ నెల 14 నుంచి ప్రత్యక్ష ఆందోళనకు రెడీ అవుతున్నట్లు ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ తెలిపింది. ఈ నెల 15, 16 తేదీల్లో భోజన విరామంలో ఆందోళనలు, 17న ర్యాలీలు.. 20న కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు చేయనున్నట్లు వెల్లడించారు ఉద్యోగ సంఘాల నేతలు. అప్పటికి.. ప్రభుత్వం స్పందించకుంటే ఈ నెల 27న చలో విజయవాడకు సిద్ధమని ప్రకటించారు. పరిస్థితులు చేయి దాటితే.. సమ్మెకు కూడా వెనుకాడబోమని కూడా ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించారు. ఈ క్రమంలోనే.. ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరపబోతోంది.