విశాఖపట్నంలో ఓ విద్యార్థి డెత్ మిస్టరీ పోలీసులకు సవాల్ విసురుతోంది. కాలేజ్కు వెళ్లిన ఆమె ఫ్యాకల్టీ ఫ్లాట్లో మృతదేహమై కనిపించింది. దీంతో ఆమెను హత్య చేశారా..? లేక వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుందా అన్న విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మల్కాపురం జయేంద్ర కాలనీకి చెందిన జ్యోత్స్న బుల్లయ్య కాలేజీలో బీటెక్ ఫస్టియర్ చదువుతోంది. రెండేళ్ల కిందట ద్వారకానగర్లోని ఓ కోచింగ్ సెంటర్లో శిక్షణ నిమిత్తం జాయిన్ అయింది. అక్కడే బీహార్కు చెందిన ఫ్యాకల్టీ అంకుర్తో పరిచయం ఏర్పడింది. అతడు తన స్నేహితుడితో కలిసి శాంతిపురంలోని కట్టా ఎన్క్లేవ్లో నివాసం ఉంటున్నాడు. సోమవారం ఉదయం కాలేజ్ వెళ్లేందుకు బస్టాండ్ దగ్గరకు జ్యోత్స్న వచ్చింది. స్వయంగా జ్యోత్స్న తండ్రే ఆమెను బస్టాండ్ దగ్గర వదిలి వెళ్లాడు. ఆ తరువాత ఏమైందో తెలీదు కానీ సోమవారం మధ్యాహ్నం 3గంటలకు జ్యోత్స్న, అంకుర్ ఫ్లాట్లో శవమై కనిపించింది.
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అంకుర్ను విచారించారు. జ్యోత్స్న తన ఫ్లాట్లోని ఎందుకు వచ్చిందో తెలీదని.. తాను తన స్నేహితుడు ఫ్లాట్కు వచ్చే సరికి జ్యోత్స్న మృతదేహంగా కనిపించిందని అంకుర్ తెలిపాడు. ఫ్యాన్కు ఉరివేసుకొని జ్యోత్స్న చనిపోయిందని అంకుర్ చెప్పాడు. దీంతో జ్యోత్న్స ఒక్కతే అంకుర్ ఫ్లాట్కు ఎందుకు వెళ్లింది..? అక్కడేం జరిగింది..? చనిపోయే సమయంలో జ్యోత్స్నతో పాటు మరెవరైనా ఉన్నారా..? ఫ్యాన్ చాలా ఎత్తులో ఉండగా.. ఆమె ఎలా ఆత్మహత్య చేసుకుంది..? ఉరి వేసుకొని చనిపోయిన జ్యోత్స్నను ఎవరు కిందికి దించారు..? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తును చేస్తున్నారు.
మరోవైపు జ్యోత్స్నది ఆత్మహత్య కాదని, హత్యేనని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, మర్డర్ చేసి సూసైడ్గా చిత్రీకరిస్తున్నారని వారు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించారు.