ఉభయ తెలుగు రాష్ట్రాలలో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకూ ఆందోళనకరస్థాయిలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణలో ఈ ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 334కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనా కారణంగా 11 మంది మరణించారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 252కు చేరుకోగా అత్యధికంగా కర్నూలు జిల్లాలో 53 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఆదివారం ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ రాత్రి పది గంటల సమయంలో హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. హైదరాబాద్లో అత్యధికంగా 145 కేసులను గుర్తించగా, తర్వాతి స్థానంలో వరంగల్ అర్బన్ జిల్లా ఉన్నట్లు ప్రకటించారు. ఇక్కడ మొత్తం 23 కరోనా కేసులను గుర్తించారు. తర్వాతి స్థానాల్లో నిజామాబాద్ (19), నల్గొండ (13), మేడ్చల్ (12), ఆదిలాబాద్ (10), కామారెడ్డి (8), కరీంనగర్ (6) ఉన్నాయి. ఇక కరోనా వల్ల తెలంగాణలో మరణించిన వారి సంఖ్య 11గా ఉంది.
అటు ఏపీలో కరోనా కోరలు చాస్తోంది. ఆదివారం ఒక్కసారిగా కర్నూలు జిల్లా ఉలిక్కిపడింది. ఒక్కరోజే ఇక్కడ 49 కేసులు నమోదు కావడంతో జిల్లాలో హై–అలర్ట్ ప్రకటించారు. శనివారం రాత్రి 9 గంటల నుంచి ఆదివారం సా.5 గంటలు వరకు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 252కు చేరినట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్లో పేర్కొంది. ఆదివారం ప్రకాశం జిల్లాలో 2, చిత్తూరు జిల్లాలో 7, నెల్లూరు జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో ఆదివారం వరకు నమోదైన కేసుల్లో 11 విదేశాల నుంచి వచ్చిన వారు కాగా, వారి కాంటాక్ట్ ద్వారా ఆరుగురికి , మరో ఆరుగురు కరోనా లక్షణాలతో చేరినట్లు వైద్య శాఖ పేర్కొంది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 252 కేసుల్లో 229 కేసులు ఢిల్లీ మూలాలు ఉన్నవారివేనని అధికారులు గుర్తించారు.