కల్తీ చేయడానికి కాదేదీ అనర్హం అన్నట్లుగా పరిస్థితి తయారైంది. బ్రాండ్ పేర్లతో ప్యాకింగ్ చేసి నకిలీలను విక్రయించే దందాకు అడ్డుకట్ట వేశారు కృష్ణాజిల్లా వ్యవసాయ శాఖ అధికారులు. వ్యవసాయ పనులు ప్రారంభం కావటంతో నకిలీ విత్తనాలను అంటగట్టేవారు కూడా రంగంలోకి దిగారు. ఇలాంటివారి కథకు కత్తెర పెట్టారు అధికారులు. జి.కొండూరు కేంద్రంగా జరుగుతున్న నకిలీ వ్యాపారాన్ని గుర్తించారు. జి.కొండూరు మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఓ రైతు వద్ద 53 క్యాన్సర్ ప్రేరేపిత గ్లైసిల్ బీటీ ప్రత్తి విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారంతో విత్తనాల షాపుల్లో తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
స్వాధీనం చేసుకున్న పత్తి విత్తన ప్యాకెట్లపై ఎలాంటి చిరునామా, తయారి వివరాలు లేవని వ్యవసాయ శాఖ అధికారి రాంకుమార్ తెలిపారు. కృష్ణాజిల్లా గన్నవరం నుండి పలు ప్రాంతాలకు రవాణా అవుతున్నాయని తెలిపారు. ఈ విత్తనాల వాడకం మనుషులకు, పశువులకు, పర్యావరణానికి హానికరమని అన్నారు. నిషేధిత విత్తనాలను కలిగి ఉంటే చట్ట ప్రకారం చర్యలుంటాయి హెచ్చరించారు.