భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు వీర మరణం పొందిన విషయం తెలిసిందే. ఏడాదిన్నరగా సరిహద్దులో విధులు నిర్వహిస్తోన్న సంతోష్ మరణంతో ఆయన కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగారు. ఆయన మరణవార్తతో సూర్యాపేటలో సంతోష్ కుటుంబం నివసించే విద్యానగర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక సంతోష్ మరణంపై తల్లి మంజుల స్పందించారు. ”నా కుమారుడు సంతోష్ బాబు దేశం కోసం పోరాడి అమరుడైనందుకు సంతోషంగా ఉంది. దేశం కోసం నా కుమారుడి ప్రాణాలు పోయాయి. ఉన్న ఒక్క కుమారుడు చనిపోవడం బాధిస్తోంది. కానీ దేశం కోసం కుమారుడు చనిపోయినందుకు మరోవైపు గర్వంగా ఉంది” అని ఆమె అన్నారు. ఇదిలా ఉంటే సంతోష్ మరణ వార్త విని ఆయన అత్త ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.
Read This Story Also: సుశ్.. నా హృదయంలో ఓ భాగం పోయింది: కృతి సనన్ ఎమోషనల్ పోస్ట్