విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సోదర భావంతో చర్చించుకోవడం హర్షించదగ్గ పరిణామమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఐదేళ్ల నుంచి ఎటూ తేలని వివాదాల విషయంలో పరస్పర చర్చల ద్వారా సత్వర పరిష్కారం కోసం ప్రయత్నించటం అభినందించాల్సిన అంశమన్నారు. కేంద్రం జోక్యం అవసరం లేకుండా పరిష్కారం చేసుకోగలిగితే ఇంకా మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇరురాష్ట్రాల సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్, జగన్ చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావాలని ఆయన ఆకాంక్షించారు. గత ఐదేళ్లలో ఇదే కోరుకున్నానని, కారణం ఏదైనా అది కార్యరూపం దాల్చలేదన్నారు. పరిపాలనా సౌలభ్యం, సత్వర అభివృద్ధికోసం రాష్ట్రాలు విడిపోయినా తెలుగు ప్రజలంతా కలిసి ఉండాలని ఆశిస్తున్నట్లు వెంకయ్యనాయడు తెలిపారు.