Tiger Tension in Kakinada: కాకినాడ జిల్లా పత్తిపాడు పరిసర ప్రాంతాల్లో బెంగాల్ టైగర్ టెన్షన్ తెలుగు డైలీ సీరియల్ లా కొనసాగుతూనే ఉంది. ఇదిగో ఇక్కడ పులిని చూశాం అంటూ.. అటవీశాఖ అధికారులు సమాచారం అందుకుని అక్కడకి చేరుకునేలోగా ఠక్కున మాయం అవుతోంది. మరో ప్రాంతంలో ప్రత్యక్షమవుతూ… అధికారులతో దాగుడుమూతలాడుతోంది.. అయితే రాయల్ బెంగాల్ టైగర్ ని బంధించడం కోసం మళ్ళీ అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు.. ఈ సారి డిఫరెంట్ పంథాలో ప్రయత్నాలు మొదలు పెట్టారు..
4 నెలలుగా దొరకకుండా అటవీ శాఖా అధికారులను ముప్పు తిప్పలు పెడుతున్న పులి కోసం మళ్లీ వేట మొదలు పెట్టారు ఏపీ అటవీశాఖ అధికారులు. ఈసారి మీరట్ నుంచి ప్రత్యేక బోన్ ను తెప్పించారు. పులిని బంధించేందుకు ప్రస్తుతం ఉన్న బోన్ చిన్నది. దీంతో పులి పట్టుబడ్డ సమయంలో గోళ్ళ తో తనను తాను రక్కుకుని గాయపరుచుకునే అవకాశంఉందని.. అందుకనే ఇప్పుడు పెద్ద బోన్ ను తెప్పించామని అధికారులు చెప్పారు. ఇప్పటికే బెంగాల్ టైగర్ పలుమార్లు కేజ్ వరకూ వెళ్లి.. మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్లిన దాఖలాలున్నాయి.
కాకినాడ జిల్లా నుంచి విజయనగరం అటవీ పరిధిలోకి వెళ్లిన ఈ టైగర్.. మళ్ళీ తిరిగి అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశించిందని అధికారులు పేర్కొన్నారు. కోటపాడు మండలం చంద్రయ్యపాలెం శివారులో ఈ ఉదయం ఒక పశువును పులి చంపింది. దీంతో ఈ సాయంత్రం పులి తిరిగి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే పులికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అయినా బంధించాలని గతంలో చేసిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇప్పటివరకు జనాలపై దాడులు చేయకపోవడం తో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం జనావాసాలకు దగ్గరగా సంచరిస్తూ ఉండడం తో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..