సీఎం జగన్ తన సొంత జిల్లా కడప అభివృద్దిపై దృష్టి పెట్టారు. వైసీసీ అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కొత్తలో రెండురోజులు పులివెందులలో ప్రజాదర్బార్ నిర్విహించిన జగన్ ప్రజాసమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే ఆయన జిల్లాకు సంబంధించిన డెవలప్మెంట్ వర్క్స్ గురించి అధికారులతో పలుసార్లు సమీక్షలు నిర్వహించారు. ఇక తాజాగా కడపలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కడప జిల్లాలో జమ్మలమడుగు మండలంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలోనే ప్రతిపాదనలు సిద్దం చేసింది. సున్నపరాళ్లపల్లి , నందలూరు గ్రామాల మధ్యలో ఈ ప్లాంట్ నిర్మాణం జరగనుంది. తాజా నిర్ణయంతో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 26 న ఈ ప్లాంటుకు పునాది వేయనున్నారు. కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పేర్ని నాని కడపలో స్టీల్ ప్లాంటుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ఏపీ హై-గ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. 3,295 ఎకరాల భూమిని కూడా సమకూర్చనుంది. ఇక ప్లాంటుకు కావాల్సిన ఇనుప ఖనిజం సరఫరా కోసం ఎన్ఎమ్డిసితో గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రైలు మరియు రోడ్డు మార్గాల అనుసంధానం కోసమే జమ్మలమడుగు మండలంలో ప్లేస్ను నిర్ధారించామని మంత్రి తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేరే ప్రదేశంలో కడప స్టీల్ ప్లాంట్కు పునాది రాయి వేశారు కదా అని మీడియా..పేర్ని నానిని ప్రశ్నించగా..దానితో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. కాగా రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమంయలోనే కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆయన ఆకస్మక మరణంలో అవి ప్రతిపాదనల దశలోనే ఆగిపోయాయి. జగన్ తాజా నిర్ణయంతో కడప వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.