Andhra Pradesh: ప్రయోజకుడు అవుతాడనుకుంటే.. వ్యసనపరుడయ్యాడు.. అప్పులు తీర్చలేక పాపం ఆ తల్లిదండ్రులు..

|

Aug 15, 2024 | 12:55 PM

ఒక్కడే కొడుకు.. మంచిగా చదివించి ప్రయోజకుడిగా మార్చాలని కలలు కన్నారు.. చదవు కోసం ఎంతైనా ఖర్చు చేసేవారు.. చూస్తుండగానే ఇంటర్ పూర్తయింది.. ఆ తర్వాత ఖర్చుకు వెనకాడకుండా కొడుకును డిగ్రీ చదవడానికి బెంగళూరుకు పంపారు.

Andhra Pradesh: ప్రయోజకుడు అవుతాడనుకుంటే.. వ్యసనపరుడయ్యాడు.. అప్పులు తీర్చలేక పాపం ఆ తల్లిదండ్రులు..
Crime News
Follow us on

ఒక్కడే కొడుకు.. మంచిగా చదివించి ప్రయోజకుడిగా మార్చాలని కలలు కన్నారు.. చదవు కోసం ఎంతైనా ఖర్చు చేసేవారు.. చూస్తుండగానే ఇంటర్ పూర్తయింది.. ఆ తర్వాత ఖర్చుకు వెనకాడకుండా కొడుకును డిగ్రీ చదవడానికి బెంగళూరుకు పంపారు. ఆ తర్వాత కొడుకు ఎంత అడిగితే అంత డబ్బు ఇచ్చేవారు. కానీ.. అతను మాత్రం ఎంజాయ్ చేసేవాడు.. తల్లితండ్రి ఇచ్చిన డబ్బుతో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు పెట్టేవాడు.. అలా అతని వ్యసనంగా మారింది.. అంతటితో ఆగకుండా జూదం ఆడేవాడు.. అది కాస్త వ్యసనంగా మారడంతో కోట్లకు కోట్లు అప్పులు చేశాడు. దీంతో తల్లిదండ్రులు చాలా మనోవేదనకు గురయ్యారు.. కుటుంబ పరువు పోతుందని ఆస్తి మొత్తం అమ్మారు.. అయినా అప్పులు తీరలేదు.. అప్పు ఇచ్చిన వారి ఒత్తిళ్లు అధికం కావడంతో తల్లిదండ్రులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా వెలుగోడు మండలం అబ్దుల్లాపురంలో చోటుచేసుకుంది.

ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్లాపురం గ్రామానికి చెందిన ఉదారు మహేశ్వరరెడ్డి (45), ప్రశాంతి (39) దంపతులకు నిఖిల్‌రెడ్డి ఒక్కగానొక్క కొడుకు.. డిగ్రీ చదివేందుకు బెంగళూరు వెళ్లిన అతను.. ఆన్‌లైన్‌ బెట్టింగుల్లో భారీగా డబ్బులు కోల్పోయి రూ.2.40 కోట్ల మేర అప్పులు చేశాడు.. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.. వాటిని తీర్చేందుకు మహేశ్వరరెడ్డి దంపతులు అబ్దుల్లాపురంలోని పదెకరాల భూమి, ఇల్లు, వ్యవసాయ కల్లం అన్నీ విక్రయించారు. అయినా కొడుకు చేసిన అప్పులు తీరలేదు. మిగిలిన అప్పు తీర్చాలని రుణదాతలు ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో మామ వెంకటేశ్వరరెడ్డి ఇచ్చిన మూడెకరాల భూమిని విక్రయించాలని మహేశ్వర్ రెడ్డి దంపతులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో.. ఆ భూమి కొనేవాళ్లు దాన్ని మరీ తక్కువకు అడగడం వారిని మరింత కలచివేసింది. దీంతో మహేశ్వరరెడ్డి దంపతులు మంగళవారం అర్ధరాత్రి అబ్దుల్లాపురం సమీపంలోని పొలానికి వెళ్లి, పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.

బుధవారం తెల్లవారుజామున అటువైపు వెళ్లిన రైతులు మహేశ్వర్ రెడ్డి, ప్రశాంతి దంపతుల మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించిన వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..