Operation Muskaan drive: ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్ ముస్కాన్ను మళ్లీ వేగవంతం చేశారు. కరోనా వైరస్ నుంచి వీధి బాలలను, బాల కార్మికులను సంరక్షించేందుకు డీజీపీ గౌతం సవాంగ్ ఆదేశాలపై చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమానికి పోలీసు యంత్రాంగం శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో అనేక మంది చిన్నారులను గుర్తించి సంరక్షణా గృహాలకు, వారి తల్లిదండ్రులకు అప్పగించారు.
కరోనా కట్టడిలో భాగంగా ఏపీ ప్రభుత్వం వీధి బాలల కోసం ‘ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్ 19’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, హోటళ్లు, దాబాలు, ఇటుక బట్టీలు, ఆటో గ్యారేజ్లు, ఇలా వివిధ కర్మాగారాల్లో పోలీసులు జల్లెడ పడుతున్నారు. ప్రభుత్వ శాఖల సమన్వయంతో పోలీస్ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
వివిధ కారణాలతో తప్పిపోయిన బాలబాలికలు, బాల కార్మికులు, అనాథ పిల్లలను గుర్తించి.. వారిని తల్లిదండ్రుల వద్దకు, అనాథలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు. బాల కార్మికులు, 14 సంవత్సరం లోపు వీధి బాలలకు విముక్తి కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఐసిడిఎస్, ఎన్జీఓలు ,వివిధ శాఖల సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
మనం క్రిమినల్స్ రికార్డులు తిరగేస్తే.. వారిలో ఎక్కువమంది అనాథలు, లేదంటే ఇంట్లోంచి చిన్నప్పుడే పారిపోయి వచ్చేసినవారు ఉంటారని ఓ సర్వేలో వెల్లడైంది. వీరికి ఎదగడానిక వేరే అవకాశం లేక.. తిండికి కూడా ఎదురు చూస్తూంటారు. మాఫియా ఇలాంటివారినే టార్గెట్ చేసి.. వారికి ట్రయినింగ్ ఇచ్చి క్రిమినల్స్గా మార్చి సమాజంపైకి ఉసిగొల్పుతుంది. నేరస్తుడిని పట్టుకోవడం కంటే.. నేరాన్ని నియత్రించడమే కరెక్టనే కాన్సెప్టును ఫాలో అయ్యే డీజీపీ గౌతమ్ సవాంగ్.. పిల్లలను నేరస్తులుగా మారకముందే.. వారిని సన్మార్గంలో పెట్టాలనే ఉద్దేశంతో నడిపే ఆపరేషన్ ముస్కాన్ ప్రతి ఏడాది గట్టిగా అమలు చేస్తున్నారు.
ఇప్పటివరకు వ్యాప్తంగా నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో 34,037 మంది బాలబాలికలను గుర్తించిన ఆంధ్రప్రద్ పోలీసు శాఖ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. మొదటి విడతలో భాగంగా 2020 జనవరి 4న చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ లో 4,035 మంది పిల్లలను గుర్తించారు. రెండో విడత జూలై 20, 2020న చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో 4,806 బాలబాలికలను రక్షించారు. మూడో విడతలో భాగంగా నవంబర్ 3, 2020న ఐసిడిఎస్, ఎన్జీఓలు ,వివిధ శాఖల సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున 16,457 మంది చిన్నారులను గుర్తించారు. నాలుగో విడతలో భాగంగా ఈ ఏడాది మే 19న నిర్వహించిన ‘ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్ 19’ అనే కార్యక్రమం ద్వారా 8,739 మంది వీధి బాలలను, బాల కార్మికులను రక్షించారు. వారిలో కొందరిని తల్లిదండ్రుల వద్దకు, అనాథలను పునరావాస కేంద్రాలకు తరలించారు.
ఇక, రాష్ట్రవ్యాప్తంగా రక్షించిన పిల్లల్లో బాలురలే ఎక్కువగా ఉన్నట్లు ఏపీ పోలీసు శాఖ వెల్లడించింది. ఇందులో మగ పిల్లలు 84.6 శాతం ఉంటే ఆడ పిల్లలు 16.4 శాతం ఉన్నట్లు తెలిపింది. ఇందులో 1 నుంచి 5వ తరగతి వరకు చదువుకున్న పిల్లలు 26.16 శాతం ఉంటే, 6 నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నవారు 61.51 శాతంగా ఉన్నారు. ఇక, 12.33 శాతం మంది పిల్లలు అసలు చదువుకోలేదని పోలీసులు పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో ఎంతోమంది చిన్నారులు అనాథలుగా మారుతున్నారు. వివిధ దేశాల్లో, యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో సర్వం కోల్పోయి అనాథలుగా మారినవారి సంక్షేమం కోసం నేడు ప్రపంచ అనాథల దినోత్సవం లేదా వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫాన్స్ (World Day of War Orphans)ను నిర్వహిస్తున్నారు. ఇక, వివిధ రకాల వ్యాధులు, పేదరికం, కరవు, యుద్ధం, తిరుగుబాట్ల వల్ల ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షలమంది పిల్లలు అనాథలుగా మారారు. ఇక ఇటీవల కాలంలో వెలుగుచూసిన కరోనా మహమ్మారి అనేక జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. కరోనా బారినపడిన తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోతుంటే, వారి పిల్లలు అనాథల్లా మారుతున్నారు. ఒకే ఇంట్లో అత్యధిక సంఖ్యలో మరణాలు కరోనా కారణంగా సంభవిస్తున్నాయి.
అయితే, వివిధ కారణాల దృష్ట్యా వీధి బాలలుగా మారుతున్న వారిని పరిశీలిస్తే.. 68.16 మంది పిల్లలు పేదరికం వల్లే రోడ్డున పడుతున్నారు. మిగిలిన 22.74 శాతం మంది చెడు అలవాట్లకు తమ కుటుంబాలకు దూరమయ్యారు. 9.02 శాతం మంది తల్లిదండ్రులు లేక అనాథలుగా మిగిలారని పోలీసులు గుర్తించారు. వీధి బాలలుగా మారినవారిలో మానసికంగా వికలాంగులుగా మారిన వారిలో 0.05 శాతం మంది ఉండగా, శారీరక వైకల్యం బారిన పడినవారు 0.4 శాతంగా ఉన్నారు. ఇక పూర్తి ఆరోగ్యంగా ఉన్న 99.55 శాతం ఉన్నట్లు తేలింది. అయితే, వీరిలో 51.55 శాతం మంది కూలీ పని చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. 33.71 మంది బాలబాలికలు వివిధ వృత్తుల్లో పని చేస్తున్నట్లు ఆపరేషన్ ముస్కాన్ ద్వారా పోలీసులు గుర్తించారు. ఇక, 1.95 శాతం మంది పిల్లలు రోడ్లపై, వివిధ ఆలయాల వద్ద బిచ్చగాళ్లుగా మారారు. 12.5 శాతం మంది వీధి బాలలుగా మారి తిండి తిప్పలకు కూడా తీవ్ర స్థాయిలో అవస్థలు పడుతున్నట్లు ఏపీ పోలీసు శాఖ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
ముఖ్యంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో వీధి పిల్లలను రక్షించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పంతో పని చేస్తో్ంది. ఇందులో భాగంగా ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్ 19 చేపట్టింది. కరోనా వైరస్ థర్డ్ వేవ్ ప్రబలే అవకాశముందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో అనాథ పిల్లలను రక్షించేందుకు ఏపీ పోలీసు శాఖ వివిధ స్వచ్చంధ సంస్థలతో కలిసి పిల్లల సంరక్షణ కార్యక్రమం చేపట్టింది. ఇప్పటి వరకు గుర్తించిన వీధి బాలల్లో 5,642 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 66.84 శాతం మందికి కరోనా నెగిటివ్గా తేలింది. ఇందులో 1.17 శాతం మంది పిల్లలకు మాత్రమే కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కాగా ప్రభుత్వ శాఖల సమన్వయంతో పోలీస్ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీని ద్వారా తప్పిపోయిన బాలబాలికలు, బాల కార్మికులు, అనాథ పిల్లలను గుర్తించి.. వారిని తల్లిదండ్రుల వద్దకు, అనాథలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అనారోగ్యంగా ఉన్న పిల్లలను ఆసుపత్రులకు తరలించి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.
ఏపీ పోలీసులకు నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి ప్రశంసలు
బాల కార్మికులను నిర్మూలించడంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేసిన కృషిని, వీధి పిల్లలు, అనాథలను కరోనావైరస్ మహమ్మారి నుంచి రక్షించడానికి తీసుకున్న చర్యలను నోబెల్ గ్రహీత, ఎన్జీఓ వ్యవస్థాపకుడు బచ్చన్ బచావో అండోలన్ కైలాష్ సత్యార్థి ప్రశంసించారు. బాల కార్మిక నిర్మూలనకు ‘ఆరోగ్య హక్కును’ ప్రాథమిక హక్కుగా చేసుకోవాలని, అలాంటి పిల్లల ఆరోగ్య, విద్యా అవసరాలను తీర్చడానికి నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్థించారు.బాల కార్మికులకు వ్యతిరేకంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, మంత్రిత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, పౌర సంఘాలకు పిలుపునిచ్చారు.
Read Also… Corona Vaccine: కరోనా టీకా ప్రతి సంవత్సరం తీసుకోవాలా? బూస్టర్ డోస్ తప్పనిసరి అవసరమా? నిపుణులు ఏమంటున్నారు?