Amaravati Farmers Maha Padayatra: అమరావతి రైతు మహాపాదయాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతుంది. రైతు పాదయాత్రకు అడుగడుగున ప్రజలు నీరాజనాలు పలుకున్నారు. టీడీపీ, జనసేన సభ్యులు సైతం పాదయాత్రలో పాల్గొని రైతులకు మద్దతు పలికారు. అమరావతి రైతుల మహా పాదయాత్ర బాపట్ల జిల్లా నుంచి కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది. తొమ్మిదోరోజు బాపట్ల జిల్లాలోని రేపల్లె శివారు నుంచి ప్రారంభమైన యాత్ర పెనుమూడి వారధి మీదుగా కృష్ణా జిల్లాలోకి అడుగుపెట్టింది. అమరావతి రైతులు అవనిగడ్డ మండలం పులిగడ్డ వద్ద కృష్ణా జిల్లాలోకి ప్రవేశించారు. పెనుమూడి వారధిపై కృష్ణా జిల్లా ప్రజలు.. మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, రైతులు, టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. స్వాగతం పలికేవారితో వారధిపై సందడి వాతావరణం కనిపించింది.
ఓవైపు కృష్ణమ్మ పరవళ్లు మరోవైపు జన ప్రవాహంతో రైతుల పాదయాత్ర ఉరకలెత్తే ఉత్సాహంతో ముందుకు సాగింది. అమరావతి రైతుల మహాపాదయాత్రకు మద్దతుగా అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. రైతుల పాదయాత్ర ఆకుపచ్చని ప్రవాహంలా కనిపించింది. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ఎలాంటి అసత్య ప్రచారాలు చేసినా యాత్రను విజయవంతంగా కానసాగిస్తామని చెప్పారు అమరావతి రైతులు. సాయంత్రం చల్లపల్లిలో ముగిసింది.