ప్రభుత్వ ఖజానా నుంచి వేలకు వేలు జీతం తీసుకుంటున్నా ఓ ఉద్యోగి బుద్ధి మారలేదు. ఇవాళ పెన్షన్లు పంపిణీ చేస్తూ.. వృద్ధుల దగ్గర నుంచి 500 చొప్పున వసూలు చేశాడు. ఇప్పుడా విషయం బయటపడడంతో చివరికి సస్పెన్షన్కి గురయ్యాడు. పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిందీ ఘటన. ఓ సచివాలయ ఉద్యోగిని విచారణ తర్వాత ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. పెన్షనర్ల దగ్గర రూ.500 చొప్పున వసూలు చేశాడని ఆరోపణపై వెంటనే విచారణ జరిపి నిర్ణయం తీసుకున్నారు. బాలునాయక్పై బాధితులు ఫిర్యాదుతో అతన్ని సస్పెండ్ చేసినట్టు చెప్పారు మున్సిపల్ కమిషనర్. మాచర్లలోని 9వ వార్డు సచివాలయంలో ఈ ఘటన జరిగింది. వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ మూడవత్ బాలు నాయక్ ఇప్పుడు వృద్ధుల పెన్షన్ డబ్బుల నుంచి ఐదేసి వందలు తీసుకుని ఉద్యోగం పోగొట్టుకున్నారు.
స్వయంగా ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేసిన సీఎం…
గుంటూరు జిల్లా మంగళగిరిలో పెన్షన్ల పంపిణీని ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు. పెనుమాక ఎస్టీ కాలనీలో బానావత్ నాయక్ కుటుంబానికి మొదటి పెన్షన్ అందజేశారు. పూరి గుడిసెలో ఉంటున్న లబ్ధిదారుని ఇంటికి వెళ్లి నగదు అందించారు. నాయక్కు వృద్ధాప్య ఫించన్, అతని కుమార్తెకు వితంతు పెన్షన్ అందజేశారు సీఎం. ఆయన ఇద్దరి కుమారులు చదువు గురించి ఆరా తీశారు. వారి నివాసంలో 30 నిమిషాల పాటు కూర్చొని బాగోగుల గురించి మాట్లాడారు. నాయక్ అభ్యర్థన మేరకు ఇంటిని నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు సీఎం. చంద్రబాబుతో పాటు మంత్రి, స్థానిక ఎమ్మెల్యే నారా లోకేష్ లబ్ధిదారుని ఇంటికి వెళ్లారు. అగ్రవర్ణాలు ఆర్థికంగా అభివృద్ధి చెందారన్న సీఎం.. ఎస్సీ, ఎస్టీలు అభివృద్ధి చెందాలని సీఎం అన్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి పిఠాపురం నియోజకవర్గ పర్యటనకు పవన్ వచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో జరిగి నపెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పవన్ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..