Bowenpally kidnap case: బోయిన్పల్లి కిడ్నాప్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కృష్ణా జిల్లాకు చెందిన దేవరకొండ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. తనపై కొందరు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం నాడు ఆయన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం మీడియాతో మాట్లాడిన వెంకటేశ్వరరావు.. భూమా అఖిలప్రియ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. వైసీపీ అభిమానిగా ఉన్న తనను రాజకీయంగా కావాలనే ప్రత్యర్థులు ఇరికిస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ అభిమానిగా ఉన్న తనను రాజకీయంగా దెబ్బతీయాలనే కుట్రలో భాగంగానే తనను భూమా అఖిలప్రియ కేసులో ఇరికించడానికి ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. తన పిల్లలను ఇప్పటికే తెలంగాణ పోలీసులు విచారిస్తున్నారని, పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నామని ఆయన చెప్పారు.
తప్పుంటే చర్యలు తీసుకోవాలని పోలీసులకు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. కిడ్నాప్ కేసులో తెలంగాణ పోలీసుల తీరు అభినందనీయం అన్నారు. కాగా, తాను పరారీలో ఉన్నానంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వెంకటేశ్వరరరావు మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన రెండు చానళ్లు తనపై తప్పుడు ప్రచారం చేశాయని ఆయన ఆరోపించారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. మీడియా వాస్తవాలు, అవాస్తవాలను గుర్తించి ప్రసారం చేయాలని హితవుచెప్పారు. రాజకీయంగా తనను ఇబ్బంది పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెంకటేశ్వరరావు తెలిపారు.
Also read:
కోడి పందేలలోనూ సై అంటోన్న మహిళామణులు, పుంజులతో బరిలోకి దిగిన తూర్పుగోదావరి జిల్లా ఆడపడుచులు