CM Jagan: ప్రతి 50 ఇళ్లకు గృహ సారథి.. సచివాలయం పరిధిలో ముగ్గురు కన్వీనర్లు.. జగన్ సంచలన నిర్ణయం

|

Dec 08, 2022 | 7:29 PM

2024 ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు ఏపీ సీఎం జగన్‌. పార్టీని పూర్తి స్థాయిలో సన్నద్ధం చేస్తున్నారు. ఇవాళ జరిగిన పార్టీ కోఆర్డినేటర్లు, జిల్లా ఇన్‌ఛార్జుల మీటింగ్‌‌లో పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేశారు.

CM Jagan: ప్రతి 50 ఇళ్లకు గృహ సారథి.. సచివాలయం పరిధిలో ముగ్గురు కన్వీనర్లు.. జగన్ సంచలన నిర్ణయం
Ap Cm Jagan Mohan Reddy
Follow us on

పార్టీ నేతలతో ఏపీ సీఎం జగన్ గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. నియోజకవర్గాలుగా పార్టీ పరిస్థితి, గడపగడపకు మన ప్రభుత్వం, ఎన్నికలే ఎజెండాగా ఈ సమావేశం జరిగింది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తున్న జగన్ పార్టీని పూర్తి స్థాయిలో సన్నద్ధం చేస్తున్నారు. బాధ్యత తీసుకోవడంలో వెనుకడుగు వేస్తే కష్టమైనన్న జగన్.. ప్రతి 50 ఇళ్లకు గృహ సారథి పేరుతో పార్టీ తరపున ఇద్దరు వాలంటీర్లను ఏర్పాటు చేయాలని నేతలకు ఆదేశించారు. ప్రతి టీమ్‌లో ఒక మహిళా కార్యకర్త ఉండాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయం పరిధిలో ముగ్గురు కన్వీనర్లు ఉండాలని, 5 లక్షల 20 వేల మంది గ్రామ సారథుల్ని నియమించాలని సూచించారు. 10 రోజుల్లో బూత్ కమిటీలు నియమించాలని ఆదేశించారు జగన్‌.

అలాగే ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో ముగ్గురు పార్టీ కన్వీనర్లను నియమించాలని, అందులో కూడా తప్పనిసరిగా ఓ మహిళ ఉండాలని మొత్తంగా 45 వేల మందిని నియమించాలని జగన్ స్పష్టం చేశారు. డిసెంబర్ 20 నాటికి గ్రామ, వార్డు సచివాలయాల్లో పార్టీ కన్వీనర్ల నియామకం పూర్తి కావాలన్నారు. ఆపై 10-15 రోజుల పాటు ఇంటింటికీ పార్టీ సచివాలయ కన్వీనర్లు వెళ్లాలని ఆదేశించారు.

అర్హత ఉండీ ప్రభుత్వ పథకాలు అందని ఒక్క వ్యక్తి కూడా రాష్ట్రంలో ఉండకూడదన్న జగన్… గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాలు 92 శాతం ఇళ్లకు చేరగా, పట్టణ ప్రాంతాల్లో 84శాతం ఇళ్లకు చేరాయని, నగరాల్లో కూడా సుమారు 78 శాతం ఇళ్లకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని జగన్ అన్నారు. ప్రతి చోట బటన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..