ఆంధ్రప్రదేశ్లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా తేదీలు ఖరారయ్యాయి. ఇందుకు సంబందించి షెడ్యూల్ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ విడుదల చేసింది. డిసెంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటనలో వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 9,679 మంది అభ్యర్థులు మెయిన్స్ రాయనున్నట్లు పేర్కొంది. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మెయిన్స్ పరీక్ష జరుగుతుందని తెలిపింది. ఉదయం 8:45 గంటల నుంచి 9:30 గంటల మధ్య మాత్రమే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్తోపాటు ఏదైనా గుర్తింపు కార్డు తీసుకొని రావాల్సిందిగా కమిషన్ తెలిపింది. అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేసేందుకు విజయవాడ కమిషన్ కార్యాలయంలో ప్రత్యేకించి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని పేర్కొంది. అలాగే, ఏవైనా ఫిర్యాదులు, పరీక్షకు సంబంధించిన సమచారం కోసం 0866-252-7820, 0866-252-7821, 0866-252-7819 నంబర్లను సంప్రదించాలని తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు సమాచారం పొందవచ్చని ఏపీపీఎస్సీ ప్రకటనలో పేర్కొంది. అయితే, పరీక్షకు హాజరయ్యే ప్రతి అభ్యర్థి కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించింది.