10th Class Exam: ఏపీలో పదో తరగతి పరీక్షలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. అసలు టెన్త్ పరీక్షలు నిర్వహిస్తారా..? లేదా అనేదానిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది తప్పనిసరిగా పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
మే నెలలో పదో తరగతి పరీక్షలను నిర్వహించాలని భావిస్తున్నామని, వారం రోజుల్లో పరీక్షల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. అయితే 11 పేపర్లా.. 6 పేపర్లా అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
కాగా, కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే విద్యాసంస్థలు మూత పడ్డాయి. వైరస్ కారణంగా విద్యార్థులు ఎంతో నష్టపోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇప్పుడిప్పుడే పై తరగతుల విద్యార్థులకు క్లాసులు నిర్వహించేందుకు ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. గత ఏడాది పదో తరగతి పరీక్షలు నిర్వహించకుండానే వారిని ప్రమోట్ చేశాయి పలు రాష్ట్రాలు. ఈ ఏడాది కూడా పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తారా .. లేదా అనే దానిపై సందేహం వ్యక్తం అవుతున్న తరుణంలో మంత్రి ఈ ప్రకటన చేశారు.