ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడుతుండటంతో ఈలోగానే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనుంది ప్రభుత్వం.. దీనికి సంబంధించి ఎప్పటి నుంచి సమావేశాలు నిర్వహించాలనే దానిపై ప్రభుత్వం అధికారులతో చర్చించింది. ఫిబ్రవరి ఐదో తేదీ సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రాధమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఫిబ్రవరి 5,6,7 తేదీల్లో సమావేశాలు జరగనున్నాయి. అయితే ఎన్నికల దృష్ట్యా ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టనుంది సర్కార్. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కావడంతో డిమాండ్లపై పెద్దగా చర్చ కూడా జరిపే అవసరం ఉండదు. అందుకే మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహిస్తే సరిపోతుందనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ అవసరమైన డిమాండ్లపై బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టనుంది.
మరోవైపు వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఈ అసెంబ్లీ సమావేశాలే చివరి సమావేశాలు కావడం విశేషం. మళ్లీ కొత్త సర్కార్ కొలువుదీరిన తర్వాత సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే బడ్జెట్ ప్రతిపాదనలపై అన్ని శాఖల నుంచి ఆర్ధిక శాఖ అధికారులు ప్రతిపాదనలు తీసుకున్నారు. బడ్జెట్పై సీఎం జగన్ కూడా అధికారులకు పలు సూచనలు చేశారు.
అసెంబ్లీ సమావేశాలు త్వరలో ప్రారంభం కానుండటంతో ఎమ్మెల్యేల అనర్హతపై ఈలోగానే స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు అనర్హతకు సంబంధించి స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఈనెల 29న తన ఎదుట హాజరై వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని కోరారు. దీంతో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్లు స్పీకర్ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరిధర్లు హాజరుకాలేదు. ఇప్పటికే ఎమ్మెల్యేల వివరణ కూడా తీసుకోవడంతో ఇక స్పీకర్ నిర్ణయమే మిగిలింది. దీంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికంటే ముందే ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.