ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన.. కీలక తప్పిదాలు బయటపెట్టిన కమిటీ..!

| Edited By:

Jun 01, 2020 | 5:20 PM

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) విచారణ జరిపింది. ఈ ఘటనపై విశ్రాంత న్యాయమూర్తి శేషశయన రెడ్డి నేతృత్వంలోని

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన.. కీలక తప్పిదాలు బయటపెట్టిన కమిటీ..!
Follow us on

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) విచారణ జరిపింది. ఈ ఘటనపై విశ్రాంత న్యాయమూర్తి శేషశయన రెడ్డి నేతృత్వంలోని 5 సభ్యుల కమిటీ ఎన్జీటీకి నివేదిక సమర్పించింది. స్టైరిన్ గ్యాస్ లీకేజీ మానవ తప్పిదమని.. భద్రతా ప్రమాణాల వైఫల్యం, సంస్థ నిర్లక్ష్యం, అధికారులు పట్టించుకోకపోవడం, ఎల్జీ పాలిమర్స్ సంస్థలో సరైన యంత్రాంగం లేకపోవడం వంటి అంశాలు ఈ ఘటనకు కారణమని ఎన్జీటీ విచారణ కమిటీ నివేదికలో పేర్కొంది. ఈ సందర్భంగా విచారణ కమిటీ ఇచ్చిన నివేదికపై ఒక రోజులో అభ్యంతరాలను చెప్పాలని ఎన్జీటీ తెలిపింది. ఈ క్రమంలో ఈ రోజు సాయంత్రం లేదా మంగళవారం ఎన్జీటీ తదుపరి ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు ఎల్జీ పాలిమర్స్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్ర.. గ్యాస్ లీకేజీ ఘటనను సుమోటోగా విచారణ చేపట్టే అధికారం ఎన్జీటికీ లేదని అన్నారు. ఈ ఘటనపై ఎన్జీటి సుమోటోగా విచారణ చేపట్టే అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉందని సిద్ధార్థ అన్నారు. మరోవైపు ఈఏఎస్ శర్మ వాదనలు వినిపిస్తూ..  2001 నుంచి ఎల్జీ పాలిమర్స్ సంస్థ అనుమతులు లేకుండానే కార్యకలాపాలు సాగిస్తుందని అన్నారు. ఏపీ పొల్యూషన్ బోర్డుతో ఎల్జీ పాలిమర్స్ సంస్థ కుమ్మక్కయిందని.. గ్యాస్ లీకేజీ ఘటన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎల్జీ పాలిమర్స్ సంస్థ సుమోటోగా కేసు విచారణ వద్దంటున్న నేపధ్యంలో తన పిటిషన్‌ని పరిగణనలోకి తీసుకుని ఆ సంస్థకు నోటీసులు ఇవ్వాలని శర్మ వాదించారు.

Read This Story Also: అమానుష ఘటన.. ఆసుపత్రుల నిర్లక్ష్యం.. ఆటోలో మరణించిన నిండు గర్భిణి