మే 11 నుండి ఇంటర్ మూల్యాంకనం

|

May 08, 2020 | 7:35 AM

మే 11 నుండి రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియ ప్రారంభించాలని విద్యాశాఖ మంత్రి ..

మే 11 నుండి ఇంటర్ మూల్యాంకనం
Follow us on

మే 11 నుండి రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియ ప్రారంభించాలని ఏపీ  విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఇంటర్మీడియెట్ బోర్డు అధికారుల‌కు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్ధేశం చేశారు. ఆరెంజ్, గ్రీన్ జోన్ లలో మే 11 నుండి ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాలను మూల్యాంకనం చేయనున్నట్లు మంత్రి సూచన ప్రాయంగా తెలిపారు. లాక్ డౌన్ ముగిసిన అనంతరం రెడ్ జోన్ లో మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలు అనుసరించి, కోవిడ్-19 జాగ్రత్తలను పాటిస్తూనే మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.మే 11 నుంచి ఆరెంజ్, గ్రీన్‌జోన్లలో ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం మొదలవుతుంది. లాక్‌డౌన్‌ ముగిసిన అనంతరం రెడ్‌జోన్లలో మూల్యాంకన ప్రక్రియ ప్రారంభమవుతుంది. 13 జిల్లాల్లోనూ జిల్లా కేంద్రాల్లో మూల్యాంకన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మూల్యాంకనానికి రెండు, మూడు భవనాలను గుర్తించి ప్రక్రియ ముగిసేదాకా కేటాయించిన భవనాల్లో సిబ్బందికి భోజనం, వసతి ఏర్పాట్లు చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

ఇప్పటికే ఈసెట్, ఐసెట్, ఎంసెట్, పీజీఈసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీఈసెట్‌ పరీక్షలకు తేదీలు ఖరారు చేసినందున ఇంటర్‌ ఫలితాలు వెల్లడించ‌దేందుకు ప్ర‌భుత్వం స‌న్న‌ద్ధం అవుతోంది. మార్చిలో జరిగిన ఇంటర్‌ పరీక్షలకు ప్రథమ సంవత్సరంలో 5,46,162 మంది, ద్వితీయ సంవత్సరంలో 5,18,280 మంది విద్యార్థులు హాజరయ్యారు. 60 లక్షల పేపర్లను మూల్యాంకనం చేయాల్సి ఉంది.