Amalapuram Tension: అమలాపురంలో ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఆందోళనకారులు మరింత రెచ్చిపోతున్నారు. ఆందోళనకారులను అదుపుచేయలేని స్థితిలోకి నిరసన కార్యక్రమాలు ఉన్నాయి. ఆందోళనకారులు భీకరమైన విధ్వంసం సృష్టిస్తున్నారు. నిరసనకారుల దాడుల్లో ఎస్పీ సహా 20 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. 3 ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. 2 ప్రైవేటు బస్సులకు నిప్పు పెట్టారు. జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ స్థానిక మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లపైనా దాడులు చేశారు ఆందోళనకారులు. మొదట మంత్రి విశ్వరూప్ ఇంటిపై అటాక్ చేసిన నిరసనకారులు.. ఆయన ఇంటికి నిప్పు పెట్టారు. దాంతో ఆయన ఇల్లు మొత్తం అగ్నికి ఆహుతైంది. ఆ తరువాత ఎమ్మెల్యే సతీష్ ఇంటిపై అటాక్ చేసిన ఆందోళనకారులు.. ఆయన ఇంటికి కూడా నిప్పు అంటించారు. ఎమ్మెల్యే ఇంటి పర్నీచర్ను ధ్వంసం చేశారు. పరిస్థితి ఎంతకీ కంట్రోల్లోకి రాకపోవడంతో పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటి హెచ్చరిక కింద ఉన్నపళంగా ఆందోళనలు విరమించాలని ఆందోళనకారులను ఆదేశించారు. లేదంటే కాల్పులు జరపాల్సి వస్తుందంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు గాల్లోకి కాల్పులు జరిపారు పోలీసులు.