టెంపుల్ సిటిలో కల్తీ ఫుడ్ దందా.. అధికారుల కొరతే అసలు కారణమా..

| Edited By: Srikar T

Jun 28, 2024 | 2:30 PM

టెంపుల్ సిటీ. నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడే తిరుపతిలో ఇప్పుడు కల్తీ ఫుడ్ కలవరపెడుతోంది. తిరుపతిలోనే కాదు. జిల్లాలో విచ్చలవిడిగా ఆహార కల్తీ దందా రాజ్యమేలుతోంది. అయితే పట్టించుకోని అధికారుల తీరు జనాలకు శాపంగా మారుతోంది. నిషేధిత రసాయనాలు వాడకంతో ప్రజారోగ్యం గుల్లవుతోంది.

టెంపుల్ సిటిలో కల్తీ ఫుడ్ దందా.. అధికారుల కొరతే అసలు కారణమా..
Tirupati
Follow us on

టెంపుల్ సిటీ. నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడే తిరుపతిలో ఇప్పుడు కల్తీ ఫుడ్ కలవరపెడుతోంది. తిరుపతిలోనే కాదు. జిల్లాలో విచ్చలవిడిగా ఆహార కల్తీ దందా రాజ్యమేలుతోంది. అయితే పట్టించుకోని అధికారుల తీరు జనాలకు శాపంగా మారుతోంది. నిషేధిత రసాయనాలు వాడకంతో ప్రజారోగ్యం గుల్లవుతోంది. పోయేది ప్రజల ఆరోగ్యమేగా అన్నట్లు పరిస్థితి తయారయింది. తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తున్న అధికార యంత్రాంగం నిర్వాకం వల్ల ప్రజల ఆరోగ్యంతో కల్తీ మాఫియా ఆటలాడుతోంది. తిరుబండారాలు, మాంసం, పాలు, నూనె ఇలా అన్నింటా కల్తీ రాజ్యమేలుతోంది. ప్రజారోగ్య సంరక్షణ కోసం ఎన్ని చట్టాలు ఉన్నా కార్యరూపం దాల్చక పోతుండటం వల్ల తిరుపతిలో వందలాదిగా ఉన్న హోటళ్ళు, వేల సంఖ్యలో ఉన్న స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు.. మారుతున్న ప్రజల ఆహారపు అలవాట్లను ఆసరాగా చేసుకుని దోపిడీ చేస్తున్నాయి. ప్రత్యేకించి హోటళ్ళు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఆహార కల్తీ కొనసాగుతోంది. క్షేత్ర స్థాయిలో జరిగే మోసాలు, లోపాలపై దృష్టి సారిస్తే తప్ప అనేక చేదు నిజాలు బయట పడని పరిస్థితి నెలకొంది.

ఆహార తనిఖీ విభాగంలో సిబ్బంది కొరతతో తిరుపతి, తిరుమలలోనే కాకుండా జిల్లాలో తనిఖీలు చేపట్టడం మానేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇతర శాఖల అధికారుల నిర్లక్ష్యం, ప్రజల్లో అవగాహన లోపం కారణంగా కల్తీ వ్యాపారానికి పెట్టుబడిగా మారిపోతుంది. ధనార్జనే ధ్యేయంగా చెలరేగుతున్న అక్రమ వ్యాపార ధోరణి.. ప్రజారోగ్యాన్ని కల్తీకి గురిచేస్తోంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిబంధనల ప్రకారం ప్రతి 25 వేల జనాభాకు ఒక ఆహార తనిఖీ అధికారి ఉండాలన్న నిబంధన ఉంది. అయితే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారుల సంఖ్య 60 కి మించి లేని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఉన్న అధికారులకు కూడా ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో ఒక్కో అధికారి దాదాపు 30 మండలాలు తిరగాల్సిన పరిస్థితి ఉంది. ఉన్న కొద్దిమందికి కేసులు, వాటి పరిష్కారం కోసం కోర్టులు చుట్టూ తిరగాల్సిన వస్తుంది. దీంతో ఆహార తనిఖీ అటకెక్కగా.. కల్తీ ఫుడ్ జనానికి దిక్కయింది. చికెన్ పకోడీ, బజ్జి దుకాణాలు, టిఫిన్ సెంటర్లలో ప్రతిరోజు కాగిన నూనెనే తిరిగి వాడకంతో ప్రజారోగ్యం దెబ్బతింటుంది.

మరోవైపు కుళ్ళిన చికెన్, అధిక మోతాదులో రంగులు వేసి చేస్తున్న ఆహారం జనం ప్రాణాలను కూడా బలి తీసుకుంటుంది. ఇలాంటి ఘటనలపై ఫిర్యాదులు వస్తే తప్ప అధికారులు ముందుకు రాని పరిస్థితి ఉంది. వారం రోజుల క్రితం తిరుమల బైపాస్ రోడ్లోని పీఎస్ 4 హోటల్‎లో భోజనం చేస్తుండగా అందులో జెర్రి వచ్చింది. ఈ ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహించిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు కొన్ని చేదు నిజాలు బయటపెట్టారు. కిచెన్‎లో తనిఖీ చేసిన అధికారులు ఫంగస్ వచ్చిన కూరగాయలు, క్రిమి కీటకాలు ఉన్న పదార్థాలను గుర్తించారు. అపరిశుభ్రంగా ఉన్న కిచెన్‎లో పాడైపోయిన వంట సరుకులు, చీమలు, పురుగులను గుర్తించారు. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955 అనుసరించి పలు సెక్షన్ల కింద హోటల్‎ను సీజ్ చేసిన అధికారులు.. ఈ మేరకు జిల్లా యంత్రాంగానికి నివేదిక సమర్పించారు. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో కల్తీ ఆహార దందా కొనసాగుతుందని గుర్తించిన ప్రభుత్వం.. కలెక్టర్ చైర్మన్‎గా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారితో పాటు పలువురితో కమిటీని నియమించింది. నిరంతరం తనిఖీలు జరిగేలా చర్యలు చేపట్టింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..