ఇండియన్ మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ పైన, మరో ఇద్దరిపైనా మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో కేసు దాఖలైంది. తనను వీరు రూ. 20.96 లక్షల మేర మోసగించారని మహ్మద్ షాహబ్ అనే ట్రావెల్ ఏజంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఔరంగాబాద్లోని డానిష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏజన్సీ యజమాని అయిన ఈయన.. ఈ కేసు వివరాలను తెలియజేశారు. అజారుద్దీన్ పర్సనల్ అసిస్టెంట్ ముజీబ్ ఖాన్ అభ్యర్థనపై తాము గత ఏడాది నవంబరులో అజారుద్దీన్కు, మరికొందరికి రూ. 20.96 లక్షల విలువైన అంతర్జాతీయ విమాన టికెట్లను బుక్ చేశామని, ఆన్లైన్ ద్వారా ఈ మొత్తానికి చెల్లింపులు జరుపుతామని ముజీబ్ హామీ ఇచ్చారని ఆయన తెలిపాడు.
కానీ తనకీ సొమ్ము అందలేదని, చివరకు ముజీబ్ ఖాన్ను సంప్రదించగా.. ఆయన సహచరుడైన సుదేష్ అవక్కల్ అనే వ్యక్తి తను రూ. 10.6 లక్షలను ట్రాన్స్ఫర్ చేసినట్టు ఈ-మెయిల్ పంపారని, కానీ అసలా డబ్బే తమ సంస్థ బ్యాంక్ అకౌంటులో జమ కాలేదని ఆయన వెల్లడించాడు. ఎన్నిసార్లు అడిగినా వారి నుంచి తనకెలాంటి సమాధానం రాలేదని షాహబ్ పేర్కొన్నారు. దీంతో అజారుద్దీన్ తో బాటు ఈ ఇద్దరి మీదా తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆయన చెప్పాడు. ఖాకీలు వీరిపై ఛీటింగ్, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే షాహబ్ చేసిన ఆరోపణలు అవాస్తవమని, తాను లీగల్ సలహా తీసుకుని అతనిపై రూ. 100 కోట్ల మేర పరువునష్టం దావా వేస్తానని అజారుద్దీన్ ఓ వీడియోను పోస్ట్ చేశారు.
I strongly rubbish the false FIR filed against me in Aurangabad. I’m consulting my legal team, and would be taking actions as necessary pic.twitter.com/6XrembCP7T
— Mohammed Azharuddin (@azharflicks) January 22, 2020