అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు కేసీఆర్ ప్రభుత్వం మరోసారి ఆవకాశం ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. కేవలం వారం రోజుల్లోనే లక్ష కుపైగా ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. అక్రమ లే అవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్లలో భవిష్యత్తులో నిర్మాణం చెయ్యడానికి అవకాశం లేనందున వాటిని రెగ్యులరైజ్ చేసుకునేందుకు పెద్ద ఎత్తున ప్రజలు ముందుకు వస్తున్నారు. ఈనెల 7వ తేది నుండి ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభం కాగా.. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,08,505 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా కొత్తగా వచ్చిన మున్సిపాలిటిల్లో 45,449 దరఖాస్తులు, కార్పొరేషన్లలో 26,316 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో జిహెచ్ఎంసి పరిధిలో 7 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం అన్ని దరఖాస్తులకుగాను ఇప్పటి వరకు 11 కోట్ల 2 లక్షల రూపాలయలు ఫీజుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది.