యాదాద్రిలో రెండు పుష్కరిణిలు..కొండపైన, కొండ దిగువన

|

Jul 02, 2020 | 12:26 PM

తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. యాదాద్రి క్షేత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కొండపై ఉన్న విష్ణు పుష్కరిణి. ఇప్పుడు ఆ పుష్కరిణి రూపురేఖలు మారబోతున్నాయి. గతంలో ఉన్న..

యాదాద్రిలో రెండు పుష్కరిణిలు..కొండపైన, కొండ దిగువన
Follow us on

తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. శాస్త్రానుసారం, ముఖ్యమంత్రి కేసీఆర్ దిశా, నిర్ధేశాల మేరకు ఆలయ పునర్ నిర్మాణ పనులు ముమ్మరంగా చేపడుతున్నారు అధికారులు. యాదాద్రి క్షేత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కొండపై ఉన్న విష్ణు పుష్కరిణి. యాదగిరి గుట్టకు వచ్చే భక్తుల్లో చాలా మంది ఇక్కడి విష్ణు పుష్కరిణిలో స్నానమాచరిస్తారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటారు. అయితే, ఇప్పుడు ఆ పుష్కరిణి రూపురేఖలు మారబోతున్నాయి. గతంలో ఉన్న విష్ణుపుష్కరిణికి బదులుగా ఇప్పుడు రెండు పుష్కరిణులతో సరికొత్తగా ఆధ్యాత్మికతకు శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం.

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలోని పుష్కరిణిలో సహజ సిద్ధంగా ఏర్పడిన నీటి గుంట ఒకటి ఉంటుంది. ఆ గుంటలో నుండి వచ్చే నీటి ధారతో పుష్కరిణి ఎప్పుడు నిండుగా ఉండటం, భక్తులు వేల సంఖ్యలో ఇక్కడ పుణ్యస్నానాలు చేస్తుండేవారు. కానీ, కాలక్రమేణ మరమ్మతుల నేపథ్యంలో పుష్కరిణిలో కాంక్రీటు వేయడం, కరువు పరిస్థితుల కారణంగా నీటి గుంట మూసుకుపోవడంతో పాటు జలధార కూడా తగ్గుముఖం పట్టింది. అయితే, ప్రస్తుతం తెలంగాణ సర్కార్ చేపట్టిన ఆలయ పునర్ నిర్మాణ పనుల్లో భాగంగా ఇక్కడ రెండు పుష్కరిణులు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొండపైన, కొండ దిగువన వాటిని నిర్మించేందుకు వైటీడీఏ ఇప్పటికే పనులు ప్రారంభించింది.

పుష్కరిణి విస్తీర్ణం కుదించి, లక్ష్మీనారసింహుడి ఉత్సవాల నిర్వహణకు అనుగుణంగా విష్ణు పుష్కరిణిని రూపొందిస్తున్నట్లు ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ పనులకు రూ.2.5 కోట్ల నిధులు వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు. కృష్ణశిలతో పుష్కరిణి మధ్య మండపం నిర్మించారు. అందులో శ్రీస్వామి ఉత్సవసేవా కార్యక్రమాలను చేపడతారు. ఈ వేడుకలను భక్తులు చూసేందుకు వీలుగా మండపం చుట్టూ ప్రదక్షిణ చేసేందుకు నిర్మాణాలు చేపట్టారు. స్లాబ్‌పై ప్లాట్‌ ఫారాలు, పైకి వెళ్లేందుకు మెట్లు కట్టారు. ఈ కట్టడాల కిందే పుష్కరిణి పుణ్యజలం ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. ఆ పుణ్యజలాన్ని ఎప్పటికప్పుడు శుద్ధిపరిచే ప్రత్యేక యంత్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.

గుట్టకు వచ్చే భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు వీలుగా కొండ కింద గండిచెర్ల ప్రాంగణంలో ప్రత్యేకించి మరో గుండం నిర్మాణానికి పనులు చేపట్టారు. తలనీలాలు సమర్పించే భక్తులు ఈ గుండంలోనే పుణ్యస్నానాలు చేసేందుకు అనుగుణంగా వసతులు కల్పించనున్నారు. ఇందులోనే శ్రీ లక్ష్మీ నరసింహుడి తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించేలా సీఎం కేసీఆర్ సూచించినట్లు అధికారులు వెల్లడించారు. తెప్పొత్సవ వేడుకలను భక్తులు కూర్చుని కళ్లారా చూసేందుకు వీలుగా కట్టడ నిర్మాణం చేపడుతున్నారు.