UP Assembly Elections: యూపీలో మజ్లిస్‌ను చూసి సమాజవ్‌వాదీ పార్టీ భయపడుతోందా?

| Edited By: Ravi Kiran

Feb 12, 2022 | 8:22 AM

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 60 శాతానికి పైగా పోలింగ్‌ నమోదయ్యింది. 2017లో కూడా ఇంచుమించు ఇంతే పోలింగ్‌ జరిగింది...

UP Assembly Elections: యూపీలో మజ్లిస్‌ను చూసి సమాజవ్‌వాదీ పార్టీ భయపడుతోందా?
Aimim
Follow us on

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 60 శాతానికి పైగా పోలింగ్‌ నమోదయ్యింది. 2017లో కూడా ఇంచుమించు ఇంతే పోలింగ్‌ జరిగింది. ప్రభుత్వం మీద ప్రజలలో వ్యతిరేకత తీవ్రంగా ఉంటే పోలింగ్‌ శాతం పెరిగి ఉండేదన్నది భారతీయ జనతా పార్టీ నాయకులు లాజిక్కు. ఈ లెక్కన ఈసారి కూడా తమదే విజయమని చెబుతున్నారు. ఇక సోమవారం జరిగే రెండో విడత పోలింగ్‌ కోసం అన్ని పార్టీలు సంసిద్ధమవుతున్నాయి. అధికారాన్ని నిలుపుకోవాలనే పట్టుదలతో బీజేపీ, అధికారాన్ని తిరిగి సాధించాలనే లక్ష్యంతో సమాజ్‌వాదీ పార్టీలు ఎన్నికల్లో గట్టిగా పోరాడుతున్నాయి. అన్ని వర్గాలను మచ్చిక చేసుకునే పనిలో పడ్డాయి. ముఖ్యంగా అభ్యర్థుల గెలుపోటములను నిర్ధారించే ముస్లిం సామాజికవర్గాన్ని తమవైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వంలోనే ముస్లిం మహిళలు క్షేమంగా ఉంటారని ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం. ముస్లింలు ఎలాగూ తమవైపే ఉంటారని ఎస్పీ భావిస్తోంది..రెండు పార్టీల ప్రయత్నాలు బాగానే ఉన్నా.. ఇప్పుడు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మజ్లిస్‌ పార్టీ సంగతేమిటి? ముస్లిం సామాజికవర్గం గంపగుత్తగా మజ్లిస్‌కు ఓటు వేస్తుందా? అసలు ఎంఐఎం పార్టీని ముస్లింలు విశ్వసిస్తున్నారా? అసలు యూపీలో ఎందుకు పోటీ చేస్తుంది? ఎవరి మేలు కోరి? అన్నది రాజకీయ విశ్లేషకులకు వస్తున్న ధర్మసందేహం!

నిజానికి మజ్లిస్‌ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ హమేషా కాషాయ దళం హితం కోరే వ్యక్తి అన్నది కొందరి వాదన. అందుకు కొన్ని ఉదాహరణలు కూడా చెబుతుంటారు. బీజేపీతో మజ్లిస్‌కు అంతర్గత ఒప్పందం ఉందని అంటుంటారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మజ్లిస్‌ పార్టీ అప్పుడు రాష్ట్రీయ జనతాదళ్‌కు తీవ్ర నష్టం తెచ్చింది. పరోక్షంగా బీజేపీకి మేలు చేసి ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది. ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్‌ కూడా అంగీకరించారు. మజ్లిస్‌ కారణంగానే తాము బీహార్‌లో అత్యధిక స్థానాలు గెల్చుకోగలిగామని సాక్షి మహారాజ్‌ ఆన్‌ రికార్డు అనడం అప్పట్లో సంచలనం సృష్టించింది. మహారాష్ట్రలోనూ మజ్లిస్‌ అదే పని చేసింది. కాంగ్రెస్‌ గెల్చుకునే సీట్లలో పోటీ చేసి పరోక్షంగా ఆ పార్టీకి తీవ్ర నష్టాన్ని తెచ్చింది. నిజానికి మజ్లిస్‌ ప్రధాన శత్రువు బీజేపీ అయినప్పుడు ఆ పార్టీతో పోరాటం చేసేవారితో చేతులు కలపాలి. కానీ మజ్లిస్‌ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోంది.

ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో ఏం చేయబోతున్నది? బీహార్‌లోలాగా ఇక్కడ కూడా విపక్షాలను దెబ్బతీస్తుందా? ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న నియోజకవర్గాలలో విజయం సాధిస్తుందా? అన్నది ఆసక్తిగా మారింది. ఉత్తరప్రదేశ్‌లో ఇంచుమించు వంద స్థానాలలో మజ్లిస్‌ పోటీ చేస్తున్నది. ఇందులో ఎనిమిది నియోజకవర్గాలలో హిందువులను నిలబెట్టింది.. ముస్లింలతో పాటుగా దళిత హిందువులను కూడా ఓవైసీ లక్ష్యంగా చేసుకున్నారు. పార్టీని విస్తరించుకోవడానికే వివిధ రాష్ట్రాలలో పోటీ చేస్తున్నామని అసదుద్దీన్‌ చెబుతూ వస్తున్నారు. నిజంగానే పార్టీని విస్తరించడానికా? లేక బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇవ్వడానికా? అన్నది కొందరి అనుమానం! ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి క్రితంసారి అంటే 2017లో జరిగిన ఎన్నికల్లో మజ్లిస్‌ కేవలం ఒక్కటంటే ఒక్క స్థానాన్ని మాత్రమే గెలిచింది. ఇప్పుడేమో స్థానికంగా ఉన్న చిన్నాచితక పార్టీలతో కలిసి పోటీ చేస్తోంది. ఈ కూటమిలో ప్రధానంగా చెప్పుకోదగ్గది భారత్‌ ముక్తి మోర్చా. ఈ పార్టీ అధినేత బాబు సింగ్‌ కుశ్వాహా.. ఈయన గతంలో మంత్రిగా పని చేశారు. కూటమి గెలిస్తే బాబుసింగే మొదటి ముఖ్యమంత్రి అని ఓవైసీ చెప్పుకొచ్చారు. అంటే తమ కూటమి గెలిస్తే ఓబీసీ నుంచి ఒకరు, దళిత వర్గానికి చెందిన మరొకరు ముఖ్యమంత్రి అవుతారన్నది ఓవైసీ ఉద్దేశం. మొదట్లో ఎస్పీతోనే జతకట్టాలనుకున్నారు ఓవైసీ.. ఎందుకో అఖిలేశ్‌ యాదవ్‌ పొత్తుకు అంత సుముఖత వ్యక్తం చేయలేదు. దాంతో బహుజన్‌ సమాజ్‌పార్టీ అధినేత్రి మాయావతిని కలిశారు. ఆమె కూడా కాదనేశారు. దాంతో చిన్న పార్టీలతో జతకట్టారు ఓవైసీ. ముస్లింలందరూ మజ్లిస్‌కు ఓటేస్తారన్న గ్యారంటీ ఏమీలేదు. కాకపోతే ఏ కొద్ది మంది అయినా మజ్లిస్‌కు ఓటు వేస్తే అది ప్రధాన పార్టీల గెలుపోటములపై ప్రభావం చూపుతుంది. ఓవైసీ కారణంగా తామే ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉందని ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో 20 శాతం వరకు ముస్లింలు ఉన్నారు. సంభాల్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 75 శాతం వరకు ఉన్నారు. మొరాదాబాద్‌, రాంపుర్‌ వంటి నియోజకవర్గాల్లో సగానికి సగం ముస్లిం ఓటర్లే ఉన్నారు. మొన్నటి వరకు ఇక్కడ సమాజ్‌వాదీ పార్టీదే హవా! యాదవులు, ముస్లింలు ఎస్పీ వెంటే నడిచారు. ఇప్పుడు మజ్లిస్‌ వచ్చింది కాబట్టి ముస్లిం ఓటర్లు కొందరు అటువైపు వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అదే జరిగితే బీజేపీ బాగా లాభపడుతుంది.