‘సీఏఏపై రాష్ట్ర అసెంబ్లీలు తీర్మానాన్నిఆమోదించవచ్చు… కానీ’….

| Edited By: Anil kumar poka

Jan 19, 2020 | 5:51 PM

వివాదాస్పద సీఏఏకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలు తీర్మానాలను ఆమోదించవచ్చునని, కానీ ఈ చట్టాన్ని అమలు చేయాలా, వద్దా అన్న నిర్ణయాన్ని ఆయా ప్రభుత్వాలు తీసుకోజాలవని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. చెన్నైలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. సవరించిన పౌరసత్వ చట్టాన్ని అమలు చేయకూడదన్న కొన్ని రాష్ట్రాల యోచన రాజ్యాంగ విరుధ్ధమని ఆరోపించారు. తొలుత ఈ చట్టానికి వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించగా.. ఇటీవలే పంజాబ్ రాష్ట్ర […]

సీఏఏపై రాష్ట్ర అసెంబ్లీలు తీర్మానాన్నిఆమోదించవచ్చు... కానీ....
Follow us on

వివాదాస్పద సీఏఏకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలు తీర్మానాలను ఆమోదించవచ్చునని, కానీ ఈ చట్టాన్ని అమలు చేయాలా, వద్దా అన్న నిర్ణయాన్ని ఆయా ప్రభుత్వాలు తీసుకోజాలవని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. చెన్నైలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. సవరించిన పౌరసత్వ చట్టాన్ని అమలు చేయకూడదన్న కొన్ని రాష్ట్రాల యోచన రాజ్యాంగ విరుధ్ధమని ఆరోపించారు. తొలుత ఈ చట్టానికి వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించగా.. ఇటీవలే పంజాబ్ రాష్ట్ర శాసన సభ కూడా తీర్మానాన్ని ఆమోదించింది. పైగా కేరళ ప్రభుత్వం ఈ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకెక్కిన మొదటి రాష్ట్రంగా నిలిచింది. (ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన సుమారు 60 పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం విచారించనుంది).

సీఏఏకు వ్యతిరేకంగా ఓ రాష్ట్రం తీర్మానాన్ని ఆమోదించిందని, కానీ ఇది ఒక రాజకీయ ప్రకటనమాదిరి ఉందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.’ ఈ విషయాన్ని  మేం అర్థం చేసుకోగలం.. వాళ్ళను మేం అభ్యంతరపెట్టబోము.. కానీ ఈ చట్టాన్ని అమలుచేయబోమన్నది మాత్రం చట్ట విరుధ్ధం’ అని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని అన్ని రాష్ట్రాలూ అమలు చేసే బాధ్యత వాటిపై ఉందన్నారు. సీఏఏకు అనుకూలంగా బీజేపీ చేబట్టిన ‘జన జాగరణ్ అభియాన్’ ప్రచారాన్ని పురస్కరించుకుని నిర్మల చైన్నెని సందర్శించారు.

సీఏఏ, ఎన్నార్సీ , ఎన్ పీ ఆర్ లను రాజస్తాన్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర కూడా వ్యతిరేకిస్తున్నాయి. కేరళ తరహాలోనే తాము కూడా సీఏఏను సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ కూడా ప్రకటించారు. అటు-ఈ వివాదాస్పద చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ఆమోదించే రాజ్యాంగబధ్ధ హక్కు ప్రతి రాష్ట్ర శాసన సభకూ ఉందని, సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ అన్నారు. సీఏఎను ఉపసంహరించాలని ఆయా రాష్టాలు కేంద్రాన్ని  కోరవచ్చు.. అది రాజ్యాంగ వ్యతిరేకమైనా సరే అని ఆయన పేర్కొన్నారు.