ఉత్తి టీ నీళ్లతో ఎంతకాలమని బతగ్గలం? ఓ పది రోజులు…ఓ నెలరోజులు..కండపుష్టిగలవారైతే బోనస్గా ఇంకో ఓ నెల… అంతకు మించి కష్టమే! కాని సంవత్సరాలకు సంవత్సరాలు ఇలా చాయ్నీళ్లతో చక్కగా బతికేయవచ్చంటోంది నందరాణి.. 30 ఏళ్లుగా ఆమె టీలతోనే సరిపెట్టుకుంటున్నారట! భోజనం జోలికి అస్సలు వెళ్లడం లేదట! ఎప్పుడో ఓసారి బెంగాలీలు ముచ్చటపడే మురీ అనే పదార్థాన్ని తింటుందట అంతే! నందరాణి ఎవరో.. ఆమె ఎందుకిలా టీలతోనే బతికేస్తుందో డిటైల్డ్గా తెలుసుకుందాం! పశ్చిమ బెంగాల్లోని దక్షిణ దీనాజ్పూర్లో ఉంటోంది నందరాణి.. ఇప్పుడామెకు 67 ఏళ్లు.. బలార్గట్లో చిన్నపాటి గుడిసెలో ఉండే ఆమె స్థానిక మార్కెట్లో చిన్న టిఫిన్ దుకాణం నడుపుతోంది.. 30 ఏళ్ల నుంచి భోజనమనేది చేయకుండా కేవలం చాయ్ మాత్రమే తాగుతూ ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా హాయిగా బతికేస్తోంది. ఎందుకలా అంటే కొడుకు కోసమట! 30 ఏళ్ల కిందట కుటంబంలో చిన్నపాటి గొడవ జరిగి కొడుకు బంగ్లాదేశ్కు వెళ్లిపోయాడు.. అప్పట్నుంచి కొడుకు మీద బెంగతో అన్నం తినడం మానేసింది నందరాణి.. రోజుకు పది పన్నెండు కప్పుల టీ మాత్రమే తాగుతుందంతే! అన్నట్టు ఆమెకు పాన్ తినే అలవాటు కూడా ఉంది.. పాన్లో ఉండే సున్నం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.. కానీ నందరాణికి మాత్రం ఎలాంటి సమస్యలు లేవు.. ఆహారం తీసుకోకున్నా చక్కగా ఉంది.. ఇదే డాక్టర్లకు అమితాశ్చర్యాన్ని కలిగిస్తోంది.. ఆమె తాగే టీలో ఎక్కువ శాతం పాలు ఉంటున్నాయి కాబట్టి ఆరోగ్యంగా ఉందేమోనన్న సందేహాన్ని వెలిబుచ్చుతున్నారు వైద్యులు.