హురియత్ కు వీడ్కోలు పలికిన వేర్పాటువాది గిలానీ

| Edited By: Pardhasaradhi Peri

Jun 29, 2020 | 5:34 PM

జమ్మూ కాశ్మీర్ లో మూడు దశాబ్దాలకు పైగా వేర్పాటువాద రాజకీయాలకు 'మూల పురుషుడు' గా ఉన్న హురియత్ కాన్ఫరెన్స్ నేత సయ్యద్ అలీ షా గిలానీ తమ సంస్థకు రాజీనామా చేశారు. 90 ఏళ్ళ ఈయన..

హురియత్ కు వీడ్కోలు పలికిన వేర్పాటువాది గిలానీ
Follow us on

జమ్మూ కాశ్మీర్ లో మూడు దశాబ్దాలకు పైగా వేర్పాటువాద రాజకీయాలకు ‘మూల పురుషుడు’ గా ఉన్న హురియత్ కాన్ఫరెన్స్ నేత సయ్యద్ అలీ షా గిలానీ తమ సంస్థకు రాజీనామా చేశారు. 90 ఏళ్ళ ఈయన.. 1990 నుంచి కాశ్మీర్ లోయలో వేర్పాటువాద ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ వచ్చారు. హురియత్ సంస్థకు జీవిత కాల అధ్యక్షుడు కూడా అయిన గిలానీ.. 2010 నుంచి గృహ నిర్బంధంలో ఉన్నారు. కాశ్మీర్ లోయలో నిరాయుధులైన నిరసనకారులపై పోలీసు కాల్పులను  ఖండిస్తూ.. వేర్పాటు వాదులను ప్రోత్సహిస్తూ వచ్చారు. ప్రస్తుత పరిస్థితిలో హురియత్ లో తలెత్తిన పరిణామాల దృష్ట్యా రాజీనామా చేస్తున్నట్టు ఆయన ఓ ఆడియో మెసేజ్ లో పేర్కొన్నారు. ఈ సంస్థతో పూర్తిగా సంబంధాలు తెంచుకుంటున్నా అని స్పష్టం చేశారు. ఇదే సమయంలో హురియత్ లోని వివిధ విభాగాలకు సుదీర్ఘమైన లేఖ కూడా ఆయన పంపారు. జమ్మూ కాశ్మీర్ కి స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన 370 అధికరణాన్ని  కేంద్రం రద్దు చేసినప్పటికీ.. తమ సంస్థలో ఏ విభాగమూ నోరెత్తలేదని, నిరసన తెలపలేదని గిలానీ ఆరోపించారు. తదుపరి కార్యాచరణపై తను వివిధ మార్గాలు సూచిస్తూ సలహాలు ఇచ్చానని, కానీ తన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని వాపోయారు. హురియత్ లో ఆర్ధిక అవకతవకలు కూడా జరిగినందుకు చింతిస్తున్నానని ఆయన  పేర్కొన్నారు.

అయితే గిలానీ చేసిన సూచనలు కాలం చెల్లినవిగా ఉన్నాయని హురియత్ లోని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. అవి ప్రస్తుత పరిస్థితులకు అనువుగా లేవని వారు విమర్శించారు.