కేరళలోని కోళీకోడ్ లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటనాస్థలమంతా బీభత్సంగా మారింది. ఈ ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం సుమారు 35 అడుగుల కింద లోయలో పడిపోగా.. పైలట్లు ఇద్దరూ మరణించారు. మృతుల సంఖ్య 19 కి పెరిగింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. మహిళలు, పిల్లల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా విషాదం నెలకొంది. రక్తమోడిన దుస్తుల్లో వీరంతా జరిగిన దారుణానికి ప్రత్యక్ష సాక్షులుగా నిలిచారు. అటు ఆసుపత్రుల్లోనూ తీవ్ర విషాద వాతావరణం ఏర్పడింది. అనేకమంది కాళ్ళు, చేతులు విరిగాయి. లోయలో సహాయ చర్యలకు భారీ వర్షం ఆటంకంగా మారింది.
రెండు ముక్కలుగా విమానం విడిపోయిందని, పెను గాలుల కారణంగా పైలట్లు రెండు సార్లు అతి కష్టం మీద విమానాన్ని దింపడానికి ప్రయత్నించారని పౌర విమాన యాన శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురి తెలిపారు. వాతావరణం ఏ మాత్రం బాగు లేకపోవడమే ఈ ఘోర దుర్ఘటనకు కారణమన్నారు.
వందే భారత్ మిషన్ లో భాగంగా విదేశాల్లో ఉన్న భారతీయులను తిరిగి ఇండియాకు తీసుకువచ్చేందుకు ఈ విమానాన్ని నిర్దేశించారు.దుబాయ్ నుంచి వస్తున్న ఈ ప్లేన్ లో 10 మంది చిన్నారులు, నలుగురు కేబిన్ సిబ్బందితో సహా 184 మంది ప్రయాణికులున్నారు. వీరిలో చాలామంది కరోనా వైరస్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయి తిరిగి ఇండియాకు వస్తున్నవారే !