లదాఖ్ లో పర్యటించిన సందర్భంగా ప్రధాని మోదీ సైన్యాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. భారత సైనికుల అత్యంత విశ్వస నీయత. గౌరవ ప్రవర్తన, సాహసం వారిని అత్యున్నత స్థానంలో నిలబెట్టిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ తమిళ కవి తిరువళ్ళువార్ రచించిన ‘తిరుక్కురళ్’ లోని ప్రవచనాలను ప్రస్తావించారు. ప్రజా జీవనంలో అన్ని వర్గాల వారికీ ఇప్పటికీ ఈ సూక్తులు అన్వయిస్తున్న విషయం గమనార్హం. ఈ దేశ గౌరవాన్నీ, అతి క్లిష్ట సమయాల్లోనూ మన సైనికులు చూపుతున్న ధైర్య సాహసాలు, వారి వినమ్రత దేశానికే ఆదర్శమని మోదీ పేర్కొన్నారు. తిరుక్కురళ్ పుస్తకంలోని 766 వ అధ్యాయం లో గల ‘పడాది మచ్చి’ వాక్యాలను ఆయన గుర్తు చేశారు. సాయుధ దళాల దేశ భక్తి, వారు భావితరాలకు ఇస్తున్న స్ఫూర్తి చిరస్మరణీయమన్నారు. కాగా-గత ఏడాది దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కూడా మోదీ.. ‘జల్-జీవన్’ గురించి ప్రస్తావిస్తూ.. నీటి పాధాన్యతను వివరించారు. ‘నీర్ ఇంద్ర అమయదు’ అనే పదాన్ని గుర్తు చేశారు. ఇలా తరచూ ఆయన.. తమిళ సూక్తులను పేర్కొంటూ ఆ భాషపై తనకు గల పట్టును చూపుతున్నారు.