వలస కార్మికులను వారి వారి స్వస్థలాలకు తరలించే విషయమై పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ ప్రభుత్వం తగినంతగా సహకరించడం లేదని హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వానికి లేఖ రాస్తూ.. ఈ వలస జీవులను తరలిస్తున్న శ్రామిక్ రైళ్లను మీ రాష్ట్రంలోకి అనుమతించకపోవడం అన్యాయం అని పేర్కొన్నారు. ఇప్పటివరకు కేంద్రం రెండు లక్షల మంది కార్మికులను ఈ రైళ్ల ద్వారా వారి స్వస్థలాలకు తరలించినట్టు ఆయన తెలిపారు. మీరిలాగే వ్యవహరిస్తే వారికి తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని అమిత్ షా హెచ్చరించారు. కరోనా వైరస్ లాక్ డౌన్ విషయంలో బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపట్ల కూడా కేంద్రం… మమత ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తిని ప్రకటించింది. ఇటీవల ఆ రాష్ట్రాన్ని విజిట్ చేసిన కేంద్ర అంతర్ మంత్రివర్గ బృందాలకు దీదీ ప్రభుత్వం సరిగా సహకరించలేదు. పైగా రాష్ట్రంలో కరోనా మరణాల రేటు ఎక్కువగా ఉందని, ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హోం శాఖ తప్పు పట్టింది.