Big Story: కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు..30 కేజీలు కాదు….180 కేజీలు !

| Edited By: Pardhasaradhi Peri

Jul 19, 2020 | 1:46 PM

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కళ్ళు చెదిరే వాస్తవాలు బయటపడుతున్నాయి.  ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి 30 కేజీల బంగారం స్మగుల్ అయినట్టు వార్తలు వచ్చాయి. అయితే దీనికి అయిదారు రెట్లు ఎక్కువగా ...

Big Story: కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు..30 కేజీలు కాదు....180 కేజీలు !
Follow us on

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కళ్ళు చెదిరే వాస్తవాలు బయటపడుతున్నాయి.  ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి 30 కేజీల బంగారం స్మగుల్ అయినట్టు వార్తలు వచ్చాయి. అయితే దీనికి అయిదారు రెట్లు ఎక్కువగా …180 కేజీల స్వర్ణాన్ని దొంగరవాణా చేసినట్టు భావిస్తున్నామని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న కస్టమ్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ అధికారులు తెలిపారు. దౌత్య మార్గాల ద్వారా (డిప్లొమాటిక్ ఛానల్) ఇన్ని కిలోల పసిడిని స్మగుల్ చేసినట్టు తాము నిర్ధారణకు వచ్చామని వారు చెప్పారు. బంగారం, సొమ్ము రీకవర్ చేసే యత్నంలో ఉన్నామని, స్మగుల్ చేసిన బంగారం ద్వారా వచ్చిన మొత్తం డబ్బు   తాము అంచనా వేసినదానికన్నా అత్యధికంగా ఉంటుందని వారన్నారు.

స్మగ్లింగ్ కేసులో ఈ సిండికేట్ 12 నుంచి 13 సార్లు దౌత్య మార్గాన్ని వినియోగించుకున్నట్టు కనిపిస్తోంది. ఇద్దరు ప్రధాన నిందితు లైన స్వప్న సురేష్, సరిత్ లను అధికారులు వారి ఇళ్లకు, కార్యాలయాలకు, ఇతర లొకేషన్లకు తీసుకువెళ్లి తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ‘స్మగ్లింగ్ రూట్’ ని తమకు అనువైనదిగా వీరు భావించారని దర్యాప్తు సంస్థల వర్గాలు పేర్కొన్నాయి. ఇదే కేసులో సందీప్ నాయర్, రమీజ్ అనే ఇద్దరు నిందితులకు ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులతో లింక్ ఉన్నట్టు తెలుస్తోంది. తిరువనంతపురం లోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పని చేసే దౌత్యాధికారి ఒకరు గతవారం ఇండియా వదిలి వెళ్ళిపోయినట్టు తెలిసింది. కేసులో ఆయన పాత్ర కూడా కీలకమైనదిగా భావిస్తున్నారు. ప్రస్తుత తాత్కాలిక దౌత్యాధికారి సమక్షంలో ఇతర సిబ్బందికి వచ్చిన సంచులను తెరిచి చూసేందుకు అధికారులు విదేశాంగ శాఖ అనుమతిని కోరారు.

జూన్ 25..జులై 3 తేదీల మధ్య బంగారంతో కూడిన మూడు బ్యాగులను వీరు అందుకున్నారని సమాచారం. విదేశాల్లో ఉన్న ఫైసల్ ఫరీద్ అనే మరో నిందితునికోసం బ్లూ కార్నర్ నోటీసు జారీ చేయాలని అధికారులు ఇంటర్ పోల్ ని అభ్యర్థించారు. ఇదిలా ఉండగా ఈ కేసులో మొదటిసారిగా క్రైమ్ కోణం కూడా బయటపడింది. తాత్కాలిక దౌత్యాధికారికి ఎటాచ్ ఉద్యోగిగా ఉన్న పోలీసు అధికారి ఒకరు తన చేతి మణికట్టుపై గాయాలతో కనిపించారు.  రెండురోజులుగా ఆయన జాడ కనిపించలేదట.. టూ వీలర్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆయనను ఎక్కడికో తీసుకువెళ్లారని శనివారం ఆయన తమ ఇంటికి చేరారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ అధికారిని పోలీసులు ఆసుపత్రికి తీసుకువెళ్తూ అసలు ఏం జరిగిందని ప్రశ్నించగా.. తనకేమీ తెలియదని గొణిగినట్టు చెప్పాడట.

అతని వాంగ్మూలాన్ని జిల్లా మేజిస్ట్రేట్ తీసుకున్నారు. మరోవైపు ఈ కేసులో నిందితులను కాపాడేందుకు సీఎం పినరయి విజయన్ కార్యాలయం ప్రయత్నిస్తోందని విపక్ష యూడీఎఫ్ నేతలు ఆరోపిస్తుండగా.. విజయన్ యధాప్రకారం వీటిని ఖండిస్తున్నారు. ఆయన ప్రభుత్వంపై అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని యూడీఎఫ్ యోచిస్తోంది.