కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా గురువారం హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లతో భేటీ అయ్యారు. మొదట రాజ్ నాథ్ సింగ్ ఇంటికి వెళ్లి ఆయనను కలిసిన సింధియా.. ఆ తరువాత షా నివాసానికి వెళ్లి ఆయనతో కూడా సమావేశమయ్యారు. సింధియాను కలిసిన ఫోటోను అమిత్ షా ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ‘సింధియా రాక మధ్యప్రదేశ్ లో ప్రజలకు సేవ చేయాలన్న బీజేపీ ధ్యేయాన్ని మరింత బలోపేతం చేస్తుంది’ అని పేర్కొన్నారు. . అటు-రాజ్ నాథ్ సింగ్ కూడా.. సింధియా తమ పార్టీలో చేరికతో పార్టీ మరింత పటిష్టమవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సింధియా తన లక్ష్యాలు, ఆశయాలను నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. మధ్యప్రదేశ్ నుంచి సింధియాను బీజేపీ రాజ్యసభకు పంపనుంది.