గాంధీ కుటుంబ ట్రస్టులపై దర్యాప్తు.. కేంద్రం ఆదేశం

| Edited By: Pardhasaradhi Peri

Jul 08, 2020 | 12:39 PM

గాంధీ కుటుంబానికి చెందిన మూడు ట్రస్టులపై దర్యాప్తు జరపాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్, ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్.. ఈ మూడు ట్రస్టులూ..

గాంధీ కుటుంబ ట్రస్టులపై దర్యాప్తు.. కేంద్రం ఆదేశం
Follow us on

గాంధీ కుటుంబానికి చెందిన మూడు ట్రస్టులపై దర్యాప్తు జరపాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్, ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్.. ఈ మూడు ట్రస్టులూ ఆదాయపు పన్ను శాఖ నిబంధనలను, విదేశీ విరాళాలకు సంబంధించిన రూల్స్ ని ఉల్లంఘించాయని ఆరోపణలు వచ్చాయి. వీటిపై దర్యాప్తును సమన్వయ పరచేందుకు అంతర్ మంత్రివర్గ కమిటీని హోమ్ శాఖ ఏర్పాటు చేసింది. మనీ లాండరింగ్, ఆదాయపు పన్ను చట్టం, ఫారిన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) యాక్ట్ వంటి చట్టాల నిబంధనలను ఇవి అతిక్రమించాయని , ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కి చెందిన స్పెషల్ డైరెక్టర్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారని ఈ శాఖ వెల్లడించింది. 1991 లో రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ని, 2002 లో రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్ ని ఏర్పాటు చేశారు. ఈ రెండు ట్రస్టులను  కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆధ్వర్యాన నిర్వహిస్తున్నారు.

యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి నిధులను రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కి మళ్లించారని బీజేపీ అధ్యక్షుడు జెపి. నడ్డా ఇటీవల ఆరోపించారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్  బోర్డులో  రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పి.చిదంబరం, మన్మోహన్ సింగ్ సభ్యులుగా ఉన్నారు. 1991 లో నాడు మన్మోహన్ సింగ్ ఆర్ధిక మంత్రిగా ఉండగా.. 100 కోట్లను రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కి (5 ఏళ్ళ పాటు సంవత్సరానికి 20 కోట్ల చొప్పున) ఇస్తున్నట్టు ఆయన తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారని నడ్డా గుర్తు చేశారు. అయితే ఈ ఆరోపణలన్నీ నిరాధారాలని, రాజకీయ కక్ష సాధింపు చర్యలని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.