ఈ రోజుల్లో నొప్పిని భరించే శక్తి తనకు ఉందని చమత్కరించారు ప్రముఖ లాయర్, సీనియర్ కాంగ్రెస్ నేత కపిల్ సిబల్. రాజస్థాన్ సంక్షోభంపై గురువారం సుప్రీంకోర్టులో వాద, ప్రతివాదనలు కొనసాగుతున్న సందర్భంగా ఆయనకు, జస్టిస్ అరుణ్ మిశ్రాకు మధ్య తేలికపాటి, ఆసక్తికరమైన సంభాషణ సాగింది. రాజస్థాన్ స్పీకర్ సీపీ జోషీ తరఫున సిబల్ వాదించారు. రెబెల్ నేత సచిన్ పైలట్ కి, ఆయన వెంట ఉన్న ఎమ్మెల్యేలకు స్పీకర్ అనర్హత నోటీసులు జారీ చేయడం సబబేనా అని న్యాయమూర్తి మొదట ప్రశ్నించారు. ఈ సమయంలో బాధను అనుభవిస్తున్నట్టుగా మీరు కనిపిస్తున్నారని సిబల్ ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించగా.. తానేమీ బాధను అనుభవించడం లేదని, అసలు నొప్పి (పెయిన్) ఫీలింగే లేదని సిబల్ సమాధానమిచ్చారు. అయినా ఈ రోజుల్లో ఆ నిరోధకశక్తి తనకు ఉందని చెప్పారు. ఆ సందర్భంలో సచిన్ తరఫు న్యాయవాది హరీష్ సాల్వే చిరునవ్వుతో ఆయనను చూడడం విశేషం. సుమారు మూడు నెలల క్రితమే ఈ విధమైన (రాజస్థాన్) పరిణామాలతోనే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ యువనేత జ్యోతిరాదిత్య సింధియా ఆ పార్టీని వీడి బీజేపీలో చేరడం.. తదనంతర పరిణామాల నేపథ్యంలో కమల్ నాథ్ ప్రభుత్వం గద్దె దిగక తప్పలేదు.