రాష్ట్రంలో రాజకీయ సంక్షోభ పరిష్కార యత్నంలో భాగంగా అవసరమైతే రాష్ట్రపతి వద్దకే సమస్యను తీసుకువెళ్తానని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. శనివారం తన వర్గం ఎమ్మెల్యేలతో సమావేశమైన ఆయన.. అసెంబ్లీలో బల పరీక్షకు తాను సిధ్ధంగా ఉన్నప్పటికీ దాన్ని అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్ ,లేదా.. అవసరమైతే ప్రధాని దృష్టికి కూడా తీసుకువెళ్తానని ఆవేశంగా వ్యాఖ్యానించారు. ‘ఏదో ఒత్తిడి’ కారణంగా గా గవర్నర్ కల్ రాజ్ మిశ్రా శాసన సభను సమావేశపరచకుండా జాప్యం చేస్తున్నారని విమర్శించారు. ‘బీజేపీ కుట్ర విఫలమయ్యేలా చూస్తాం.. సమయం వస్తే నేను రాష్ట్రపతి భవన్ లేదా ప్రధాని నివాసానికైనా వెళ్తాను’ అని ఆయన అన్నారు. మీరు సమైక్యంగా ఉండాలని, ఎవరి ప్రలోభాలకూ లొంగవద్దని, 21 రోజుల పాటు హోటల్ లోనే ఉండాల్సి వస్తుందని అశోక్ గెహ్లాట్ తన శిబిరంలోని ఎమ్మెల్యేలను ఉద్దేశించి పేర్కొన్నారు.
కాగా-అసెంబ్లీని సమావేశ పరిచే విషయమై మరో అభ్యర్థన పత్రం సమర్పించాలని గవర్నర్.. సీఎంకి సూచించారు. గెహ్లాట్ తన వర్గం ఎమ్మెల్యేలతోను, తన కేబినెట్ సహచరులతోను సమావేశమై ఉండగా.. రాష్ట్ర బీజేపీ నేత సతీష్ పునియా, విపక్షనేత గులాబ్ చంద్ర కటారియా ఆధ్వర్యంలో బీజేపీ ప్రతినిధి బృందం గవర్నర్ తో భేటీ అయి.. రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితిపై చర్చించింది.