దేశంలో మిడతల బెడదను ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు అన్ని విధాలా సాయపడతామని ప్రధాని మోదీ హామీ ఇచ్చా రు. ఈ సమస్య వల్ల యూపీ, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో ఈ రెండు వారాల్లో పంటలకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడిన ఆయన.. దేశంలోని తూర్పు ప్రాంతాల్లో ఉద్ ఫున్ తుపాను కారణంగా ముప్పు ఏర్పడగా.. ఇప్పుడు అనేక రాష్ట్రాలు మిడతల దండ్ల వల్ల ‘ప్రమాదంలో’ పడుతున్నాయన్నారు. ఒక చిన్న ప్రాణి కూడా ఎంత నష్టం కలగజేస్తుందో ఈ దాడులు తెలుపుతున్నాయని మోదీ పేర్కొన్నారు. ఇవి ఎన్నో రోజులపాటు కొనసాగుతాయని, ఈ సమస్య నివారణకు కేంద్రం, రాష్ట్రాలు కూడా ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నాయని అన్నారు. ఈ పరిస్థితిని మనమంతా సమష్టిగా ఎదుర్కోగలమన్న విశ్వాసం తనకు ఉందని ఆయన చెప్పారు. కాగా వర్షాకాల సీజన్ కూడా ప్రారంభం కావడంతో మిడతల ముప్పు మరింత పెరగవచ్చునని భయపడుతున్నారు.