హత్రాస్ ఘటనలో తమకు నార్కో టెస్ట్ నిర్వహిస్తామన్న అధికారుల సూచనను బాధితురాలి కుటుంబం తిరస్కరించింది. తమకు న్యాయం కావాలి గానీ టెస్టులు కాదని స్పష్టం చేసింది. మా కూతురి మృత దేహాన్ని చూసేందుకైనా, అంత్యక్రియలు చేసేందుకైనా యూపీ పోలీసు అధికారులు మమ్మల్ని అనుమతించలేదు.. పైగా మీ స్టేట్ మెంట్ ని మార్చుకోండి అని జిల్లా మేజిస్ట్రేట్ పదేపదే మాపై ఒత్తిడి చేశాడు అని మృతురాలి తల్లి తెలిపింది. అయినా నార్కో టెస్ట్ తమకెందుకని, ఆ టెస్ట్ ఏదో నిందితులకే చేయాలని ఆమె డిమాండ్ చేసింది. కాగా-హత్రాస్ కేసును సీబీఐ కి అప్పగిస్తూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఉత్తర్వులపై వ్యాఖ్యానించేందుకు బాధితురాలి కుటుంబం నిరాకరించింది. సీబీఐ దర్యాప్తు వల్ల తమకు న్యాయం జరిగితే అదే పదివేలని పరోక్షంగా పేర్కొంది.