ప్రేమకు కులమతాలు ఉండవంటారు. ఎల్లలు లేని ప్రేమ ఎన్ని దేశాలైన దాటుతుంది. ఒక్కోసారి ఏకంగా ఖండాంతరాలను సైతం దాటేసి మరీ ప్రేమికులు తమ ప్రేమ నిలబెట్టుకుంటుంటారు. తాజాగా ఇటువంటి సంఘటనే హర్యాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది. కైథల్ జిల్లాకు చెందిన మంజిత్ కౌర్కు.. పాక్లోని గుజార్న్వాలా ప్రాంతానికి చెందిన అవైజ్ ముక్తార్ అనే యువకుడితో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది.. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటవ్వాలని నిశ్చయించుకున్నారు. దీంతో ఆ యువతి తన బాయ్ఫ్రెండ్ కోసం ఏకంగా పాకిస్తాన్ వెళ్లే ప్రయత్నం చేసింది. కర్తార్ పూర్ కారిడార్ గుండా పాక్లో ప్రవేశించాలని ప్లాన్ చేసుకుంది. అనుకున్న ప్రకారమే..నకిలీ ఐడిని తయారు చేయించుకుంది. మన కారిడార్ను దాటి పాక్లోకి ప్రవేశించింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అంతలోనే ఆమెకు ఊహించని షాక్ ఇచ్చారు అక్కడి అధికారులు. ఆమె ఐడిని పరిశీలించిన పాక్ రేంజర్లు అది నకిలీ ఐడిగా గుర్తించారు. వెంటనే తనను అడ్డుకుని విచారించగా అసలు విషయం బయటపెట్టింది సదరు యువతి. తను ప్రేమించిన యువకుడిని పెళ్లిచేసుకోవటం కోసమే తాను ఇక్కడి వరకు వచ్చినట్లుగా చెప్పింది. దీంతో నివ్వెరపోయిన అధికారులు.. తిరిగి ఆమెను భారత్కు పంపించి వేశారు.