ఇది వ్యవస్థ వైఫల్యమే..వికాస్ దూబే కి బెయిల్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం

| Edited By: Pardhasaradhi Peri

Jul 20, 2020 | 7:07 PM

కరడు గట్టిన క్రిమినల్ వికాస్ దూబేపై 60 కి పైగా  కేసులు ఉన్నప్పటికీ అతనికి బెయిలు లభించడం దారుణమని  సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇటీవల  కాన్పూర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో దూబే మరణించిన సంగతి విదితమే. అయితే పలు కేసుల్లో..

ఇది వ్యవస్థ వైఫల్యమే..వికాస్ దూబే కి బెయిల్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం
Follow us on

కరడు గట్టిన క్రిమినల్ వికాస్ దూబేపై 60 కి పైగా  కేసులు ఉన్నప్పటికీ అతనికి బెయిలు లభించడం దారుణమని  సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇటీవల  కాన్పూర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో దూబే మరణించిన సంగతి విదితమే. అయితే పలు కేసుల్లో అతనికి కోర్టులు బెయిలు మంజూరు చేయడంపై అత్యున్నత న్యాయస్థానం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇది వ్యవస్థ వైఫల్యమే అని సీజేఐ ఎస్.ఏ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తప్పు పట్టింది. చట్టాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత యూపీ ప్రభుత్వానికి ఉందని పరోక్షంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ పై చురకలు వేసింది. దూబేకి సంబంధించిన కేసుల్లో ఆయా కోర్టులు జారీ చేసిన బెయిల్ తాలూకు కాపీల రిపోర్టును సమర్పించాలని కోర్టు సూచించింది. 65 కేసుల్లో నిందితుడిగా ఉన్న వికాస్ దూబే…. నాడు పెరోల్ పై విడుదలైన సందర్భాలు ఉన్నాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు దృష్టికి తెచ్చారు.

కాగా దూబే మృతిపైన, కాన్పూర్ దగ్గరి గ్రామంలో అతని సహచరులు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది పోలీసులు మరణించిన ఘటన పైన దర్యాప్తునకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని యూపీ ప్రభుత్వం పేర్కొన్నప్పుడు.. ఆ కమిటీలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని, ఓ మాజీ పోలీసు అధికారిని కూడా సభ్యులుగా చేర్చాలని సుప్రీంకోర్టు సూచించింది. యూపీ సీఎం, డిప్యూటీ సీఎం చేసిన ప్రకటనలను, ఆ తరువాతి సంబంధిత  అంశాలను పరిశీలించాలని యూపీ ప్రభుత్వ తరఫు లాయర్ ని ఈ బెంచ్ ఆదేశించింది. దూబే  ఎన్ కౌంటర్ కేసుతో సహా…8 మంది పోలీసుల మృతి ఘటనపైనా సమగ్ర విచారణ జరగాలని కోరుతూ సీబీఐ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ పిటిషన్లు దాఖలు చేశాయి.