రాజస్తాన్ లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. సీఎం అశోక్ గెహ్లాట్ నివాసంలో శుక్రవారం రాత్రి కేబినెట్ సమావేశమై తాజా పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించింది. అసెంబ్లీని సమావేశపరచకుండా గవర్నర్ కల్ రాజ్ మిశ్రా జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలు సుమారు 5 గంటలపాటు రాజ్ భవన్ వద్ద నిరసన ప్రదర్శనకు పూనుకొన్నారు. దీంతో అక్కడ హైడ్రామా వాతావరణం ఏర్పడింది. సీఎం గెహ్లాట్ బలనిరూపణకు శాసన సభను సమావేశపరచాలని కోరుతూ కేబినెట్ ఓ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. అనర్హత వేటు నుంచి సచిన్ పైలట్, ఆయన వర్గం బయటపడడంతో గెహ్లాట్ వర్గం ఆందోళన చెందుతోంది. తనకు 102 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలియజేస్తూ అశోక్ గెహ్లాట్ గవర్నర్ కి ఓ జాబితా సమర్పించారు. అయితే తాను రాజ్యాంగంలోని 174 అధికరణం ప్రకారం నడుచుకుంటానని గవర్నర్ హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యేలు నిరసన విరమించారు. ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితుల నేపథ్యంలో శాసన సభను ఎలా సమావేశపరచాలంటూ గవర్నర్ మొత్తం 6 పాయింట్లతో ఓ నోట్ ని ముఖ్యమంత్రికి అందజేశారు. దీనిపై కేబినెట్ చర్చించింది.