లడఖ్ లో భారత-చైనా దళాల మధ్య జరిగిన ఘటనకు చైనా మీడియా పెద్దగా ప్రాధాన్యమివ్వలేదు. తమవైపు ఎంతమంది సైనికులు మరణించారన్న విషయాన్ని కూడా వెల్లడించలేదు. ఇండియాపై ప్రతీకారం తీర్చుకోవాలని అక్కడి సోషల్ మీడియా యూజర్లు కోరినా.. మీడియా మాత్రం మౌనం వహించింది. తమ సైనికుల్లో 20 మంది మృతి చెందారని, రెండు వైపులా నష్టం జరిగిందని భారత ఆర్మీ మంగళవారం ప్రకటించింది. అదే సమయంలో.. చైనా రక్షణ మంత్రిత్వ శాఖ .. తమవైపు కొన్ని మరణాలు సంభవించాయని అంగీకరించినా ఎంతమంది సైనికులు ప్రాణాలు కోల్పోయారన్న అంశాన్ని స్పష్టం చేయలేదు. బీజింగ్ లోని మీడియా… గ్లోబల్ టైమ్స్ అయితే.. భారత సైన్యంలో మృతుల సంఖ్యను వెల్లడించినా.. చైనా సైనికుల మరణాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం విడుదల చేయలేదని వ్యాఖ్యానించింది. ‘సీసీటీవీ’ ఆధ్వర్యంలోని ‘జిన్ వెన్ లియాన్ చొ’ ఛానెల్… నిన్న ప్రసారం చేసిన వార్తల్లో ఈ ఘర్షణల ఊసే లేదు.
ఉభయ దేశాల మధ్య సైనికుల్లో ఎంతమంది గాయపడ్డారో, ఎంతమంది మరణించారో పోల్చి చూసి ఉద్రిక్తతలను మరింత రెచ్చగొట్టరాదన్న ఉద్దేశంతోనే చైనా ఈ సమాచారాన్ని వెల్లడించలేదని గ్లోబల్ టైమ్స్ తన ఎడిటోరియల్ లో పేర్కొంది. ఇండియాతో గల బోర్డర్ సమస్యలను ఘర్షణ రూపంలో మలచడాన్ని తాము ఇష్టపడడంలేదని ఇందులో వ్యాఖ్యానిస్తూ.. ఇండియా దూకుడుగా, మొండిగా వ్యవహరిస్తోందని ఆరోపించింది.