‘ మా నోళ్లు నొక్కలేరు … ‘ 180 మంది సెలబ్రిటీల ‘ ఒక్క నోరు ‘ !

| Edited By: Srinu

Oct 09, 2019 | 5:27 PM

దేశంలో జరుగుతున్న మూక దాడులగురించి ప్రశ్నిస్తూ ప్రధాని మోదీకి లేఖ రాసిన 49 మంది సెలబ్రిటీలపై బీహార్ లో రాజద్రోహం కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే వీరికి మద్దతుగా బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా , హిస్టారియన్ రొమిలా థాపర్ సహా 180 మంది ప్రముఖులు సోమవారం ఓ లేఖను విడుదల చేశారు. 49 మంది రాసిన లేఖ రాజద్రోహం ఎలా అవుతుందని వీరు ప్రశ్నించారు. దేశంలో పెరిగిపోతున్న సామూహిక మూక దాడుల వల్ల […]

 మా నోళ్లు నొక్కలేరు ...  180 మంది సెలబ్రిటీల  ఒక్క నోరు  !
Follow us on

దేశంలో జరుగుతున్న మూక దాడులగురించి ప్రశ్నిస్తూ ప్రధాని మోదీకి లేఖ రాసిన 49 మంది సెలబ్రిటీలపై బీహార్ లో రాజద్రోహం కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే వీరికి మద్దతుగా బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా , హిస్టారియన్ రొమిలా థాపర్ సహా 180 మంది ప్రముఖులు సోమవారం ఓ లేఖను విడుదల చేశారు. 49 మంది రాసిన లేఖ రాజద్రోహం ఎలా అవుతుందని వీరు ప్రశ్నించారు. దేశంలో పెరిగిపోతున్న సామూహిక మూక దాడుల వల్ల దేశ ప్రతిష్ట దిగజారిపోతోందని, వీటిని అరికట్టేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని మణిరత్నం, ఆదూర్ గోపాలకృష్ణన్, రామచంద్ర గుహ, అనురాగ్ కశ్యప్, శ్యామ్ బెనెగల్ వంటి పలువురు ప్రముఖులు నేరుగా మోదీకి గత జులైలో లేఖ రాశారు. అయితే వీరిపై బీహార్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రాజద్రోహం, పబ్లిక్ న్యూసెన్స్, మత పరమైనభావనలను రెచ్ఛగొడుతున్నారని ఆరోపిస్తూ ఈ సెక్షన్లు నమోదయ్యాయి. కానీ.. బీహార్ పోలీసుల చర్యను ఖండిస్తూ తాజాగా నసీరుద్దీన్ షాతో బాటు అశోక్ వాజ్ పేయి, జెర్సీ పింట్. టీఎం. కృష్ణ తదితరులు లేఖను విడుదల చేశారు. ఈ విధమైన వేధింపులను ఖండిస్తున్నామని, మా సహచరులు రాసిన లేఖలోని ప్రతి ఒక్క అక్షరాన్ని సమర్థిస్తున్నామని వీరన్నారు. ప్రజలను, ప్రముఖులను బాధ పెట్టేందుకు కోర్టులను దుర్వినియోగపరుస్తున్నారని దుయ్యబట్టారు. అయితే బీహార్ పోలీసులు మాత్రం 49 మంది సెలబ్రిటీలపై ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేయడాన్ని తేలిగ్గా పరిగణిస్తున్నారు. తాము ఇంకా కోర్టులో ఈ కేసు తాలూకు ఫైల్ దాఖలు చేయలేదని అంటున్నారు.

అటు-ప్రభుత్వం కూడా ఈ కేసులో తమ ప్రమేయం లేదని చేతులు దులుపుకుంది. ‘ దీనికి బీజేపీతో గానీ, ప్రభుత్వంతో గానీ సంబంధం లేదు. మోదీ సర్కార్ ప్రతిష్టను దిగజార్చడానికే ఈ ప్రయత్నం ‘ అని సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ వ్యాఖ్యానించారు. ప్రజల భావ ప్రకటనా స్వేచ్చను అణగదొక్కడానికి ప్రభుత్వం చూస్తోందన్న అభిప్రాయాన్ని కలిగించేందుకు కొన్ని స్వార్థ పరశక్తులు ఇలాంటి ప్రచారానికి పూనుకొన్నాయని ఆయన అన్నారు.
అటు-తమిళ సీనియర్ నటుడు కమల్ హాసన్ కూడా మోదీ ప్రభుత్వ చర్యను ఖండించిన సంగతి విదితమే. ఇంతమంది ప్రముఖులు దేశంలో జరుగుతున్న దారుణ సంఘటనలపై గళమెత్తితే.. దాన్ని రాజద్రోహం అంటూ ప్రముఖులపై కేసులు పెట్టడమేమిటని అనేకమంది సాధారణ ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. పైగా మంత్రి ప్రకాష్ జవదేకర్.. ‘ కొన్ని స్వార్థపర శక్తులు, తుక్ డే, తుక్ డే గ్యాంగ్ ‘ అంటూ అభివర్ణించడం విడ్డూరం.. ఇలాంటి పదప్రయోగాలను భాషా కోవిదులు సైతం హర్షించడం లేదు. ప్రధానికి లేఖ రాసిన వారిలో ఎంతోమంది ప్రముఖ రచయితలు కూడా ఉన్నారు. కేవలం దేశానికి అప్రదిష్టగా మారిన సామూహిక మూకదాడులను అరికట్టడానికి గట్టి చర్యలు తీసుకోవాలని కోరడం తప్పా అని వీరు ప్రశ్నిస్తున్నారు.