ముజఫర్‌పూర్‌ షెల్టర్‌ హోం కేసు నిందితురాలికి జేడీయూ టికెట్‌

|

Oct 08, 2020 | 4:49 PM

బీహార్‌లో ఎన్నికల కోలాహలం మొదలయ్యింది.. గెలుపు గుర్రాల కోసం పార్టీలు వెతుకులాట మొదలు పెట్టాయి.. ఇప్పుడున్న రాజకీయాలకు తగినట్టుగానే అంగబలం, అర్ధబలం ఉన్నవారిని అన్వేషిస్తున్నాయి.

ముజఫర్‌పూర్‌ షెల్టర్‌ హోం కేసు నిందితురాలికి జేడీయూ టికెట్‌
Follow us on

బీహార్‌లో ఎన్నికల కోలాహలం మొదలయ్యింది.. గెలుపు గుర్రాల కోసం పార్టీలు వెతుకులాట మొదలు పెట్టాయి.. ఇప్పుడున్న రాజకీయాలకు తగినట్టుగానే అంగబలం, అర్ధబలం ఉన్నవారిని అన్వేషిస్తున్నాయి. ఇక జనతాదళ్‌ యునైటెడ్‌ అభ్యర్థుల రెండో జాబితా కూడా విడుదల చేసింది. 90 మందితో కూడిన ఆ జాబితాలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతో పాటు కొందరు కొత్తవారు కూడా చోటు సంపాదించుకున్నారు. ఈ చిట్టాలో మాజీ మంత్రి మంజూవర్మకు నితీశ్‌కుమార్‌ చోటివ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కారణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముజఫర్‌పూర్‌ షెల్టర్‌ హోం కేసులో ఆమె ప్రధాన నిందితురాలు.. బెగుసరై దగ్గర ఉన్న బర్యార్‌పూర్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. షెల్టర్‌ హోంలో 30 మంది బాలికలపై లైంగికదాడుల ఆరోపణలు రావడం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది.. దాంతో మంజూవర్మ తన మంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది.. 2018లో ఆమెను జేడీయూ నుంచి సస్పెండ్‌ కూడా చేశారు అధినేత నితీశ్‌కుమార్‌.. ఈ సంఘటనపై విచారణ జరిపిన టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ మంజూవర్మతో పాటు ఆమె భర్త చంద్రశేకర్‌పై కూడా అభియోగాలు దాఖలు చేసింది.. ఈ నేరంలో ప్రమేయం ఉన్న మరో 11 మందిపై కూడా అభియోగాలు దాఖలు అయ్యాయి. ఆలుమగలిద్దరూ కోర్టుకు లొంగిపోయి ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.. ఈ ఘటనపై సీబీఐ కూడా దర్యాప్తు చేస్తోంది.. అలాంటి మంజూవర్మకు టికెట్‌ ఇవ్వడమేమిటా అని విపక్షాలు మండిపడుతున్నాయి.. ఇంకో విచిత్రమేమిటంటే రాష్ట్రీయ జనతాదళ్‌ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ చిన్న కొడుకు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌కు పిల్లనిచ్చిన మామ చంద్రికా రాయ్‌కు కూడా జేడీయూ టికెట్‌ ఇచ్చింది.. పర్సా నియోజకవర్గం నుంచి చంద్రికా రాయ్‌ పోటీ చేస్తున్నారు..